
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ ఇటీవలి కాలంలో ఈమె తన చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె మాతృత్వ దశను ఆస్వాదిస్తోంది. తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలోనూ గ్లామర్ లుక్తో మెరిసి అందరినీ తన వైపు ఆకర్షితం అయ్యేలా చేసింది. అయితే తల్లి అయిన తరువాత తన జీవితంలో అనేక మార్పులు వచ్చాయని ఆమె తెలియజేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఇప్పుడు తాను ఆడపులిలా మారానని అనిపిస్తోందని, అంతకు ముందు కన్నా తన జీవితాన్ని చూసే కోణం ఇప్పుడు పూర్తిగా మారిందని వెల్లడించింది.
పెళ్లి తరువాత మా అలవాట్లు ఏమీ మారలేదు: కియారా
ఒక్కోసారి మరేదీ ముఖ్యం కానట్లు అనిపిస్తుందని కియారా పేర్కొంది. కొన్ని సమయాల్లో ప్రతి చిన్న విషయం కూడా ముఖ్యమనే భావన కలుగుతుందని తెలిపింది. పెళ్లి తరువాత తన భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో తన బంధం గురించి కూడా ఆమె మాట్లాడింది. పెళ్లికి ముందు తమ మధ్య ఉన్న సరదా కబుర్లు, కలసి ప్రయాణాలు ఇవేమీ ఇప్పుడు మారలేదని, ఇప్పటికీ తాము ఇద్దరమూ కలసి సినిమాలను వీక్షిస్తున్నామని తెలిపింది. నటీనటులుగా, సినిమా ప్రేమికులుగా ఆ చిత్రాల గురించి చర్చించుకోవడం తమకు చాలా ఇష్టమని తెలియజేసింది.
చిన్నతనం నుంచే నటి అవ్వాలనే కోరిక ఉండేది..
తనకు ఎప్పుడూ నటి అవ్వాలనే కోరిక బలంగా ఉండేదని కియారా తన మనసులోని మాటను వెల్లడించింది. చిన్నప్పుడే తనలో ఆ కోరిక బలంగా ఉండేదని, తన తల్లిదండ్రులు ఆ విషయాన్ని పసిగట్టారని వెల్లడించింది. కానీ ముందుగా చదువు పూర్తి చేయాలని పట్టుబట్టారని, ఆ తరువాత వారి ప్రోత్సాహంతోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చానని పేర్కొంది. వైఫల్యమే ఉత్తమ గురువు అని తెలుసుకున్నానని, ఇక సినిమాల విషయానికొస్తే కథలు, పాత్రలతో కనెక్ట్ అయితే అంతకు మించి ఆలోచించనని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తానని తెలిపింది. తాను దర్శకుడి నటినని, దర్శకుడికి, నటులకు మధ్య ఉండే అనుబంధమే ముఖ్యమని స్పష్టం చేసింది. కాగా కియారా అద్వానీ చివరిసారిగా తెలుగులో రామ్ చరణ్తో కలిసి గేమ్ చేంజర్ అనే మూవీలో యాక్ట్ చేయగా, ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్లో చేసిన వార్ 2 మూవీ కూడా ఈమెకు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం ఈమె నటించిన టాక్సిక్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోనైనా మళ్లీ ట్రాక్లో పడాలని ఆమె భావిస్తోంది.












