
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్ను గురువారం (మార్చి 26, 2026) విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బీసీసీఐ ఏప్రిల్ 12, 2026 వరకు మాత్రమే షెడ్యూల్ను రిలీజ్ చేసింది. అయితే ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేయడంతో బీసీసీఐ ఐపీఎల్ 2026 పూర్తి స్థాయి షెడ్యూల్ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2026 సీజన్లో తదుపరి మ్యాచ్లు ఏప్రిల్ 13, 2026 నుంచి మొదలై మే 24, 2026 వరకు దేశవ్యాప్తంగా 12 వేదికల్లో జరగనున్నాయి. ఇందులో భాగంగా మొత్తం 50 మ్యాచ్లను నిర్వహించనున్నారు. బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్పూర్, న్యూ చండీగఢ్లు ఈ షెడ్యూల్లో మ్యాచ్లకు వేదికలుగా నిలిచాయి.
ఈ ఫేజ్లో 8 డబుల్ హెడ్డర్ మ్యాచ్లు..
అంతకు ముందు బీసీసీఐ మార్చి 28, 2026 నుంచి ఏప్రిల్ 12, 2026 వరకు మాత్రమే ఐపీఎల్ 2026 షెడ్యూల్ను రిలీజ్ చేసింది. ఇప్పుడు రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్లు ఆ తరువాత తేదీ నుంచి, అంటే.. ఏప్రిల్ 13, 2026 నుంచి జరుగుతాయి. ఆ తేదీ రోజు జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ను హైదరాబాద్లో ఢీకొట్టనుంది. ఏప్రిల్ 23న ముంబైలో ఎల్ క్లాసికోలో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొదటి లెగ్ మ్యాచ్ జరగనుండగా, మే 2వ తేదీన చెన్నైలో ఈ రెండు జట్ల మధ్య రెండో లెగ్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ప్రస్తుతం రిలీజ్ చేసిన షెడ్యూల్లో మొత్తం 8 డబుల్ హెడ్డర్ మ్యాచ్లు ఉండగా, మధ్యాహ్నం మ్యాచ్లు యథావిధిగా 3:30 గంటలకు ప్రారంభం కానుండగా, రాత్రి మ్యాచ్లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతాయి.
ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ల వేదికలు తరువాతే ప్రకటన..
పంజాబ్ కింగ్స్ జట్టు తమ హోం మ్యాచ్లను న్యూ చండీగఢ్తోపాటు ధర్మశాలలో ఆడనుంది. ఈ ఫేజ్లో ధర్మశాలలో మూడు మ్యాచ్లు ఉంటాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు జైపూర్ 4 గేమ్లకు ఆతిథ్యం ఇస్తుండగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 3 మ్యాచ్లను బెంగళూరులో, 2 మ్యాచ్లను రాయ్పూర్లో ఆడుతుంది. ఇక పూర్తి స్థాయి షెడ్యూల్ను రిలీజ్ చేసినప్పటికీ ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ల వేదికలను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. తరువాతి రోజుల్లో ఈ మ్యాచ్ల వేదికలను బీసీసీఐ సందర్భం, పరిస్థితులకు అనుగుణంగా ప్రకటించనున్నట్లు తెలిపింది. కాగా మార్చి 28, 2026న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఢీకొట్టనుంది. అయితే గతేడాది జూన్ 4న నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవాల్లో 11 మంది మృతి చెందిన నేపథ్యంలో వారికి సంతాపంగా బీసీసీఐ ఈ సారి ఐపీఎల్ ప్రారంభ వేడుకలను నిర్వహించడం లేదని, కానీ ముగింపు వేడుకలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇక టీ20 ప్రపంచకప్ 2026ను భారత్ గెలుచుకున్న నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ సీజన్కు విపరీతమైన క్రేజ్ ఉండడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












