
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత విడుదల చేస్తామని తెలిపారు. టోర్నమెంట్ తొలి దశ షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేశామని, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత మిగతా మ్యాచ్ల తేదీలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇరాన్-అమెరికా యుద్ధం ప్రభావం ఐపీఎల్ సీజన్పై పడనుందన్న వార్తల నేపథ్యంలో శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఐపీఎల్ వంద శాతం జరుగుతుందని క్లారిటీ వచ్చేసింది. ఫ్యాన్స్ ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారమే షెడ్యూల్..
ఐపీఎల్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. మేం ఇప్పటికే 20 మ్యాచ్ల షెడ్యూల్ను విడుదల చేశాం. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ను విడుదల చేస్తాం.. అని రాజీవ్ శుక్లా తెలిపారు. కాగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం ఆటగాళ్ల ప్రయాణాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. టీ20 ప్రపంచకప్ అనంతరం భారతదేశం నుంచి వెస్టిండీస్ జట్టు బయలుదేరడంలో కూడా ఆలస్యం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్లే విమానాలు రద్దు కావడంతో వారి ప్రయాణం వాయిదా పడింది. అంతకుముందు బీసీసీఐ ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ మ్యాచ్లు 2026 మార్చి 28 నుంచి ఏప్రిల్ 12, 2026 వరకు జరగనున్నాయి. ఈ కాలంలో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున, ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
తొలి దశలో 20 మ్యాచ్లు..
ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్గా గుర్తింపు పొందిన ఈ పోటీ 19వ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. తొలి దశలో మొత్తం 20 మ్యాచ్లు జరుగుతాయి. బెంగళూరు, ముంబై, గువాహటి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లోని 10 వేదికల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ కాలంలో టోర్నమెంట్లో నాలుగు డబుల్ హెడ్డర్లు కూడా ఉంటాయి. మధ్యాహ్నం మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. సాయంత్రం మ్యాచ్లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
డబుల్ హెడ్డర్లు ఏప్రిల్ 4 నుంచి..
శనివారం మార్చి 28, 2026న జరిగే ప్రారంభ మ్యాచ్ అనంతరం ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో పోటీ పడనుంది. ఈ సీజన్లో తొలి డబుల్ హెడ్డర్ మ్యాచ్లు 2026 ఏప్రిల్ 4న జరుగుతాయి. ఆ రోజు మధ్యాహ్నం ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అనంతరం సాయంత్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రాజస్థాన్ రాయల్స్ తమ హోమ్ మ్యాచ్లను గువాహటిలో ప్రారంభించనుంది. అక్కడ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తమ ప్రారంభ హోమ్ మ్యాచ్లను న్యూ చండీగఢ్లోని పీసీఏ స్టేడియంలో ఆడనుంది.
మార్చి 13న చిన్నస్వామి స్టేడియంపై నిర్ణయం..
ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐదు హోమ్ మ్యాచ్లను బెంగళూరులో ఆడుతుంది. మిగిలిన రెండు హోమ్ మ్యాచ్లు రాయ్పూర్లో జరుగుతాయి. పంజాబ్ కింగ్స్ జట్టు నాలుగు హోమ్ మ్యాచ్లను న్యూ చండీగఢ్లో ఆడుతుండగా, మరో మూడు మ్యాచ్లు ధర్మశాలలో జరుగుతాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడు హోమ్ మ్యాచ్లను గువాహటిలో, నాలుగు మ్యాచ్లను జైపూర్లో ఆడనుంది. ఇక బెంగళూరులో నిర్వహించాల్సిన మ్యాచ్లు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అనుమతిపై ఆధారపడి ఉంటాయని బీసీసీఐ తెలిపింది. ఈ కమిటీ 2026 మార్చి 13న ఎం. చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించనుంది. ఆ రోజున మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లపై పూర్తి స్థాయి మాక్ డెమో నిర్వహించి స్టేడియం ఐపీఎల్ మ్యాచ్లకు సిద్ధంగా ఉందో లేదో అంచనా వేయనున్నారు.












