
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి 8, 2026) హైదరాబాద్లో జరిగింది. ఇటీవల టాలీవుడ్ హీరోలు ఒకరి తరువాత ఒకరు పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. నటులు విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ వివాహాలు తాజాగా జరిగాయి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం కూడా త్వరలో జరగనుంది. శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. నటి సంయుక్త మీనన్, పలువురు దర్శకులు, హీరోయిన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వీరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది.
3 ఏళ్ల నుంచి ప్రేమలో..?
శ్రీనివాస్, కావ్య గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించి వారు ఈ వివాహం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరు గత మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. ఇక కావ్య తాత న్యాయమూర్తిగా పనిచేశారని, తండ్రి లాయర్ అని తెలుస్తోంది. వేసవిలో శ్రీనివాస్, కావ్య పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శ్రీనివాస్ గతేడాది రిలీజ్ అయిన కిష్కింధపురి సినిమాతో హిట్ కొట్టాడు. హార్రర్, కామెడీ జోనర్లలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సాధించి నిర్మాతలకు లాభాలను అందించింది. శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవతోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు.












