
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి రావడం యాదృచ్ఛికంగానే జరిగిందని వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జితేష్ శర్మ అన్నారు. సౌతాఫ్రికా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్కు ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో జితేష్ శర్మ మాట్లాడారు. చిన్నతనంలో తనకు ఆర్మీలో చేరాలనే కల ఉండేదని, కానీ క్రికెట్లోకి అనుకోకుండా వచ్చానని తెలిపారు. అయితే ఈ ప్రపంచంలోకి వచ్చాక లైఫ్ పూర్తిగా మారిపోయిందని జితేష్ అన్నారు. ఈ క్రమంలోనే క్రికెట్లోకి అసలు ఎలా వచ్చింది, ఆ తరువాత అందులో ఎదురైన కష్టాల గురించి, ఐపీఎల్లో రాణింపు గురించి జితేష్ ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
క్రికెట్లోకి అలా వచ్చా: జితేష్ శర్మ
చిన్నతనంలో స్కూల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్లో పాల్గొంటే 25 మార్కులు ఇస్తారని చెప్పారని, అందుకనే క్రికెట్ను ఎంచుకున్నానని జితేష్ శర్మ తెలిపారు. అయితే తన స్కూల్ క్రికెట్ టీంలో వికెట్ కీపర్ ఎవరూ లేకపోవడంతో తాను గ్లోవ్స్ ధరించానని, ఆ తరువాత తనకు అవి యాదృచ్ఛికంగానే అలవాటయ్యాయని తెలిపారు. అనంతరం స్థానిక కోచ్ ప్రీతం గాంధీ తనకు క్రికెట్లో శిక్షణ ఇచ్చారని, ఆయన వల్లే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానని జితేష్ తన బాల్యదశ కోచ్ను గుర్తు చేసుకున్నారు. ఇక ఐపీఎల్లో దినేష్ కార్తీక్ తనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని, ఆయన శిక్షణ, మెంటార్షిప్ వల్లే ఐపీఎల్లో రాణించగలుగుతున్నానని తెలిపారు.
ఆర్సీబీ యాజమాన్యం ప్రోత్సాహం..
ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు యాజమాన్యం కూడా తనకు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచిందని జితేష్ శర్మ అన్నారు. ఆర్సీబీ మేనేజ్మెంట్ తనకు వెన్నుదన్నుగా నిలిచి తనను ప్రోత్సహించిందని, అందుకనే కొన్ని మ్యాచ్లలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగలిగానని, ఒక ప్లేయర్కు అంతకు మించిన ప్రోత్సాహం మరొకటి ఏముంటుందని అన్నారు. కాగా టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ముందు వరకు జితేష్ పలు మ్యాచ్లలో భారత్ తరఫున ఆడినా నిరాశ పరిచాడు. ఈ క్రమంలో సెలెక్టర్లు అతన్ని టోర్నీకి ఎంపిక చేయలేదు. ఇక త్వరలో జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్కు ఆర్సీబీ తరఫున ఇతను మరోమారు ఆడనున్నాడు.












