
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని శంకర్పల్లిలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో కల్కి 2 చిత్ర షూటింగ్ను ఇటీవలే ప్రారంభించగా అందులో మొదటి షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్, కమలహాసన్ పాల్గొంటున్నారు. అందులో భాగంగానే షూటింగ్లో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ సెట్స్ లో తాను చిత్రంలోని అశ్వత్థామ గెటప్లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. అందులో ఆయన కమలహాసన్తో ముచ్చటిస్తుండడం విశేషం. ఇక కమలహాసన్తో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్న అమితాబ్ ఈ సందర్భంగా ఆయన గురించి తన బ్లాగ్ పోస్టులోనూ పలు విషయాలను ప్రస్తావించారు.
కమలహాసన్తో చాలా కాలం తరువాత కలసి నటిస్తున్నా..
కమలహాసన్తో చివరిసారిగా గిరఫ్తార్ అనే హిందీ చిత్రంలో నటించిన అమితాబ్ బచ్చన్ ఆ విషయాన్ని తన బ్లాగ్ పోస్టులో గుర్తు చేసుకున్నారు. కల్కి 2 షూటింగ్ సందర్భంగా కమలహాసన్ను కలిశా, కొన్నేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఈ సినిమాకు కలసి పనిచేస్తున్నాం, చివరిసారిగా గిరఫ్తార్ చిత్రంలో కలసి నటించాం, ఇప్పుడు కల్కి 2 చేస్తున్నాం.. అని అమితాబ్ తన పోస్టులో పేర్కొన్నారు. అయితే ప్రతి ఆదివారం ముంబైలోని తన నివాసం వద్ద గేటు బయట ఫ్యాన్స్ను కలుస్తానని, కానీ ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నానని అమితాబ్ తెలిపారు. కమలహాసన్తో ఈ చిత్రంలో స్క్రీన్ను షేర్ చేసుకోవడం, ఎంతో కాలం తరువాత ఆయనతో కలిసి నటిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
కాగా కల్కి 2లో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో నటిస్తుండగా, ఇందులో కమలహాసన్ విలన్ గా సుప్రీం యాస్కిన్ పాత్రను పోషిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తుండగా, ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై సి.అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. స్వప్న దత్, ప్రియాంక దత్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక శంకర్పల్లిలో కొనసాగుతున్న చిత్ర ప్రస్తుత షెడ్యూల్ అనంతరం చిత్రీకరించే కీలక సన్నివేశాల్లో ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది.












