
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు. తాను లీడ్ రోల్లో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న మా ఇంటి బంగారం అనే మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆమె తాజాగా ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ మూవీ వచ్చే మే 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతుందని చెబుతూ ఆమె సినిమా పోస్టర్ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే తన వ్యక్తిగత జీవితంలో తనకు ఎదురవుతున్న సవాళ్లు, సినిమా రంగంలో ఎదురవుతున్న ఒత్తిడి వంటి అంశాలపై ఆమె మాట్లాడారు.
వ్యతిరేక ప్రచారం చేస్తే సహించను..
సోషల్ మీడియాలో ఎవరైనా తనను ట్రోల్ చేసినా, పొగిడినా ఇకపై పట్టించుకోనని, అవి తనపై ఎంత మాత్రం ప్రభావం చూపించలేవని సమంత అన్నారు. అయితే తన వ్యక్తిగత జీవితంపై వ్యతిరేకతను ప్రచారం చేస్తే మాత్రం సహించనని, అలాంటి వారిని వెంటనే బ్లాక్ లిస్ట్లో పెడతానని స్పష్టం చేశారు. అలాంటి వారికి తన జీవితంలో స్థానం ఇవ్వదలుచుకోలేదని, అనవసరంగా వ్యతిరేకతను ప్రచారం చేసేవారికి తాను సపోర్ట్ చేయనని తెలిపారు. సినిమా రంగంలో తనకు ఎదురవుతున్న ఒత్తిడిపై కూడా సమంత మాట్లాడారు. తాను ఒత్తిడిని ఎదుర్కొంటున్న మాట వాస్తమేనని, కానీ తరచూ మెడిటేషన్ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుంటున్నానని తెలిపారు. ఒత్తిడిగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే మెడిటేషన్ చేస్తానని, దీంతో ప్రశాంతత, సంతోషం లభిస్తాయని అన్నారు.
నందిని రెడ్డితో మూడో సినిమాగా..
కాగా నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సమంత నిత్యం ఏదో ఒక రూపంలో తీవ్రమైన ట్రోలింగ్ను, వ్యతిరేకతను ఎదుర్కొంటూనే వస్తున్నారు. ఇటీవలే ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకున్న సందర్భంలోనూ ఆమె సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్కు గురయ్యారు. అయితే ఇకపై ట్రోలింగ్ను ఎంత మాత్రం సహించనని సమంత స్పష్టంగా చెప్పడంతో ఆమె భవిష్యత్తులో అలా చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారేమోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె నటిస్తూ, నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమాకు దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఈ ఇద్దరి కాంబోలో ఇది మూడో ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. దీంతో సమంత ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలతోపాటు ఇందులో నటించడంలోనూ బిజీగా ఉన్నారు.












