
భారత టీ20 క్రికెట్ జట్టు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్లలో మొదటి స్థానంలో ఉన్నారు. వరుణ్ చక్రవర్తి ఇతర స్పిన్నర్ల కంటే చాలా భిన్నం. అనేక వేరియేషన్లను కలిగి ఉండడం, తనదైన పేస్ మెయింటెయిన్ చేయడం, వికెట్లను టార్గెట్ చేస్తూ ఎక్కువగా బంతులు సంధించడం వంటివి వరుణ్ అమ్ముల పొదిలో ఉన్న కొన్ని అస్త్రాలు. వాటిని ఆయన ప్రత్యర్థి జట్టును బట్టి బయటకు తీస్తుంటారు. అయితే ఇటీవల న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో అంతగా ఆకట్టుకోకపోయినా టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో నమీబియాతో జరిగిన మ్యాచ్లో మాత్రం అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్లో కేవలం 2 ఓవర్లే బౌలింగ్ వేసిన వరుణ్ 3 వికెట్లు తీసి కేవలం 7 పరుగులే ఇచ్చాడు. దీంతో వరుణ్ ప్రదర్శనకు ఫ్యాన్స్ మాత్రమే కాదు, అటు ప్రత్యర్థి జట్టు నమీబియా ప్లేయర్లు కూడా విస్మయానికి గురయ్యారు.
గూగ్లీతో వరుణ్ మాయ..
నమీబియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా వరుణ్ వేసిన స్పెల్ మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. అప్పటికి నమీబియా 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగినా భారత్ లాంటి మేటి జట్టుపై ఎలాంటి బెరుకు లేకుండా ఆడింది. పవర్ ప్లే అనంతరం ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురయ్యారు. అయితే కెప్టెన్ సూర్య 7వ ఓవర్లో వరుణ్ను దించాడు. దీంతో తొలి బంతికే వరుణ్ తన అద్భుతమైన గూగ్లీతో వికెట్ తీశాడు. ఆ తరువాత మొత్తం 12 బంతుల్లో వరుణ్ 3 వికెట్లు పడగొట్టి నమీబియా ఆశలను నీరుగార్చాడు. అనంతరం ఇతర భారత బౌలర్లు మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ వరుణ్ బౌలింగ్కు తాము ఆశ్చర్యపోయామని, అలాంటి స్కిల్ బౌలింగ్ను తాము ఎన్నడూ ఎదుర్కొనలేదని తెలిపాడు.
నమీబియా కెప్టెన్ ఆశ్చర్యం..
తమకు సాధారణ లెగ్ బ్రేక్ బౌలింగ్ లో ఆడడం అలవాటే కానీ వరుణ్ బౌలింగ్ పూర్తిగా భిన్నమని ఎరాస్మస్ అన్నాడు. వరుణ్ లెగ్బ్రేక్లో అనేక వేరియేషన్లు ఉన్నాయని కితాబిచ్చాడు. వరుణ్ లాంటి క్వాలిటీ, స్కిల్స్ కలిగిన స్పిన్నర్లు అన్ని జట్లలోనూ ఉండరని, ఆయనను తాము మొదటిసారి ఎదుర్కొన్నందున అంచనా వేయడంలో విఫలం చెంది ఔట్ అయ్యామని తెలిపాడు. కాగా ఈ మ్యాచ్లో ఓటమి అనంతరం నమీబియా టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో తమ తదుపరి మ్యాచ్ను ఈ నెల 15వ తేదీన యూఎస్ఏతో చెన్నైలో ఆడనుంది. ఇక భారత్ తన తరువాతి మ్యాచ్లో అదే రోజు పాకిస్థాన్తో కొలంబోలో ఆడనుంది. అయితే పాక్తో మ్యాచ్కు భారత్ అర్షదీప్ సింగ్కు బదులుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే శ్రీలంకలో ప్రస్తుతం పిచ్లు స్పిన్కు భారీగా అనుకూలిస్తూ బంతులు ఎక్కువగా టర్న్ అవుతున్న నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్లో పేస్ బౌలర్కు బదులుగా స్పిన్ బలంతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మ్యాచ్లో జట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.








