Tollywood : చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటున్న టాలీవుడ్ పెద్ద‌లు..? ఏపీ ప్ర‌భుత్వం దిగి వ‌చ్చేనా..?

December 3, 2021 1:47 PM

Tollywood : గత వారం రోజుల‌ క్రితం ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో అత్యధిక వర్షాలు కురవడంతో పలు జిల్లాలలో వరదలు సంభవించాయి. ఈక్రమంలోనే వాగులు, వంకలు పొంగి పొర్లడంతో ఎన్నో గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. కొద్దిరోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది. ఇలా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Tollywood industry now realized after all damage is done

అధికంగా ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం జరగడంతో ఏపీ ప్రభుత్వం వెంటనే సహాయక‌ చర్యలను చేప‌ట్టింది. కాగా ఏపీలో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని పలువురు టాలీవుడ్ ఇండస్ట్రీ సెల‌బ్రిటీలు ఆంధ్రప్రదేశ్ కు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మొదట ఎన్టీఆర్ పాతిక లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపించగా ఆ వెంటనే మెగాస్టార్, రామ్ చరణ్, మహేష్ బాబు వెంట వెంటనే రూ.25 లక్షల‌ చొప్పున విరాళాలు ప్రకటించారు.

మరుసటి రోజు గీతాఆర్ట్స్ రూ.10 లక్షల విరాళం ప్రకటిస్తే వెంటనే అల్లుఅర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఈ టాప్ హీరోలందరూ పాతిక లక్షల రూపాయ‌ల‌ విరాళం ప్రకటించడంతో.. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరందరూ పాతిక లక్షల రూపాయ‌ల‌ విరాళం ఎందుకు ప్రకటించారని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

అయితే నిజానికి వీరు విరాళాలు ప్రకటించడానికి ముందే ఏపీ ప్రభుత్వం టికెట్ల విషయంలో జీవోను జారీ చేసింది. ఈ క్ర‌మంలో కొంద‌రు వైసీపీ నేత‌లు సినీ ఇండ‌స్ట్రీ సెల‌బ్రిటీల‌ను బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. ప్ర‌జ‌లు ఇచ్చే డ‌బ్బుతో టాప్ హీరోలు అయిన వారు, ఇండ‌స్ట్రీలో ఎదిగిన వారు ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు వ‌ర‌ద‌ల రూపంలో క‌ష్టాలు వ‌స్తే.. ప‌ట్టించుకోరా..? పైగా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచాల‌ని, అద‌న‌పు షోల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని అడుగుతారా ? అంటూ దుయ్య‌బట్టారు.

దీంతో ఏపీ ప్ర‌భుత్వంతో రాజీ కుదుర్చుకునేందుకేనా ? అన్న‌ట్లుగా హీరోలు, సినీ నిర్మాణ సంస్థ‌లు ఉన్న‌ట్లుండి హ‌డావిడిగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి టిక్కెట్ల రేట్లు, అద‌న‌పు షోల విష‌య‌మై ప‌లు మార్లు నిర్మాత‌లే సీఎం వైఎస్ జ‌గ‌న్‌, మంత్రి పేర్ని నానిల‌ను క‌లిశారు. హీరోలు క‌ల‌వ‌లేదు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌లు మాత్ర‌మే ప‌లు మార్లు జ‌గ‌న్‌ను క‌లిసి స‌మ‌స్య‌ల‌పై విన్న‌వించారు. అంతేకానీ మిగిలిన హీరోలు అటు వైపు చూడ‌లేదు. పైగా ఏపీ సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఒక్క చిరంజీవి, నాగార్జున త‌ప్ప ఎవ‌రూ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు కూడా తెలప‌లేదు. ఈ క్ర‌మంలో తాజాగా జీవో రావ‌డం, సినిమా వాళ్ల‌కు మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డిన‌ట్లు అవ‌డంతో.. త‌ప్పును స‌రిదిద్దుకోవ‌డం కోస‌మేనా.. అన్న‌ట్లుగా ఉన్న‌ట్లుండి హ‌డావిడిగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు.

అయితే ఇంత స‌డెన్‌గా విరాళాల‌ను ప్ర‌క‌టించినా ప్ర‌భుత్వం ఇప్ప‌టికిప్పుడు దిగి వ‌చ్చి జీవోను వెన‌క్కి తీసుకోదు క‌దా. క‌నుక సినిమా వాళ్లు ఏం ఆశించి విరాళాలు ఇస్తున్నారో తెలియ‌దు కానీ.. ప్ర‌భుత్వంతో రాజీ ప‌డేందుకు కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు పెద్ద సినిమాలు విడుద‌లైతే ప‌రిస్థితి ఏమిటి ? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి ఏపీ ప్ర‌భుత్వం సినిమా వాళ్ల‌పై జాలి, ద‌య చూపుతుందో, లేదో.. తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now