
ఇప్పటి జీవనశైలిలో స్మార్ట్ఫోన్లు కీలక భాగంగా మారిపోయాయి. బ్యాంకింగ్ నుంచి వినోదం వరకు అన్నీ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఫోన్ ఆరోగ్యానికి కూడా కొంత శ్రద్ధ అవసరం. టెక్ నిపుణుల సూచన ప్రకారం వారానికి కనీసం ఒక్కసారి ఫోన్ను రీస్టార్ట్ చేయడం ఉపయోగకరమని చెబుతున్నారు. ఫోన్ను రీస్టార్ట్ చేయడం వల్ల ర్యామ్ పూర్తిగా ఖాళీ అవుతుంది. యాప్లు మూసివేసినా కొన్ని ప్రాసెస్లు బ్యాక్గ్రౌండ్లో కొనసాగుతుంటాయి. ఇవి ర్యామ్పై భారం పెడతాయి. ఫలితంగా ఫోన్ నెమ్మదిస్తుంది. రీస్టార్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు నిలిచిపోతాయి. ఫోన్ వేగం వెంటనే మెరుగవుతుంది.
కనెక్టివిటీ లోపాలకు చెక్..
కొన్ని సందర్భాల్లో వైఫై కనెక్ట్ అయినా ఇంటర్నెట్ పని చేయకపోవచ్చు. బ్లూటూత్ లేదా మొబైల్ డేటా కూడా సమస్యలు చూపవచ్చు. చాలామంది నెట్వర్క్ను తప్పుపడతారు. కానీ సమస్య ఫోన్ సిస్టమ్లో ఉండొచ్చు. రీస్టార్ట్ చేస్తే చిన్నపాటి కనెక్టివిటీ లోపాలు సరిచేయబడే అవకాశముంది. ఫోన్ తరచుగా హ్యాంగ్ అవుతుంటే రీస్టార్ట్ తాత్కాలిక పరిష్కారం అందిస్తుంది. ఇది సిస్టమ్కు కొత్త ప్రారంభం ఇస్తుంది. అయితే సమస్య మళ్లీ మళ్లీ వస్తే కారణాన్ని గుర్తించి పరిష్కరించుకోవాలి.
యాప్ ఎర్రర్లు ఉంటే..
రీస్టార్ట్ చేయడం వల్ల ఫోన్ మెమరీ రిఫ్రెష్ అవుతుంది. చిన్నపాటి యాప్ ఎర్రర్లు స్వయంగా సరిచేయబడే అవకాశం ఉంటుంది. అందుకే టెక్ నిపుణులు వారానికి కనీసం ఒక్కసారి ఫోన్ను రీస్టార్ట్ చేయాలని సూచిస్తున్నారు. ఫోన్ను రీస్టార్ట్ చేయడం ఒక చిన్న అలవాటు మాత్రమే. కానీ దీని వల్ల పనితీరు, స్థిరత్వం మెరుగవుతాయి. స్మార్ట్ఫోన్ను దీర్ఘకాలం మెరుగైన స్థితిలో ఉంచుకోవాలంటే ఈ అలవాటును పాటించడం మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: మీ ఫోన్ నిరంతరం హ్యాంగ్ అవుతున్నా, సరిగ్గా పనిచేయకపోయినా.. అది స్టోరేజ్ నిండిపోవడం లేదా పాత బ్యాటరీ వల్ల, ఇతర కారణాల వల్ల కూడా కావచ్చు. కనుక అలాంటప్పుడు నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.








