
కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ముందు, మ్యాచ్ సమయంలో ఎన్నో ఉద్రిక్తతలు, వివాదాలు నెలకొన్నప్పటికీ.. మైదానంలో మాత్రం భారత జట్టు పూర్తిగా ప్రొఫెషనల్ దృక్పథంతో వ్యవహరించింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో పాకిస్థాన్ బ్యాటర్లను రెచ్చగొట్టే ప్రయత్నాలకు దూరంగా ఉండాలని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన జట్టుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బీసీసీఐ విడుదల చేసిన ఓ వీడియోలో సూర్యకుమార్ యాదవ్ తన సహచరులతో మాట్లాడుతూ, స్లెడ్జింగ్కి దిగకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని సూచించిన తీరు కనిపించింది. మాటల యుద్ధాల్లో ఇరుక్కోకుండా, నైపుణ్యంతోనే మ్యాచ్ను గెలవాలని ఆయన జట్టును ఉత్సాహపరిచారు.
ప్లేయర్లకు సూర్య ఏం చెప్పాడంటే..
ఓవర్ల మధ్య పరుగులు తీయండి. ఎవరికీ ఏమీ చెప్పొద్దు. మనం మంచి క్రికెట్ ఆడాలి. స్కిల్తోనే ఈ మ్యాచ్ గెలుస్తాం.. అని సూర్య చెప్పడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. కాగా గత కొద్ది రోజుల ముందు టోర్నీ నుంచి తప్పుకుంటామని పాక్ హెచ్చరించగా, మ్యాచ్ సమయంలో భారత్.. పాక్ జట్టు సభ్యులకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. అయితే ఆయా విషయాలపై మైదానంలో ఎలాంటి మాటల ఘర్షణలు లేకుండా మ్యాచ్ ప్రశాంతంగా సాగింది. మ్యాచ్ మొదలైన వెంటనే భారత జట్టు ఆధిపత్యాన్ని చాటింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి భారత్ను 175 పరుగుల బలమైన స్కోర్కు చేర్చాడు. అనంతరం పాకిస్థాన్ చేజ్లో ఎక్కడా పట్టు సాధించలేకపోయింది. భారత బౌలర్లు క్రమంగా ఒత్తిడి పెంచుతూ మ్యాచ్ను తమ వైపుకు తిప్పుకున్నారు.
View this post on Instagram
జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీసి పాకిస్థాన్ బ్యాటింగ్ను కుప్పకూల్చారు. చివరకు పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌటై, భారత్ చేతిలో 61 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కొంది. ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్-పాకిస్థాన్ హెడ్టు-హెడ్ రికార్డు 8-1గా మరింత బలపడింది. అంతేకాదు, ఈ గెలుపుతో భారత జట్టు సూపర్-8 దశకు అర్హత సాధించి, టోర్నీలో తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.








