
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ను ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ లో ఒకేసారి గరిష్టంగా 6.52 కోట్ల మంది వీక్షించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లైవ్ ఈవెంట్లలో అత్యధిక డిజిటల్ పీక్ కన్కరెన్సీగా నమోదు అయింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లండ్పై విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడంతో కోట్లాది మంది అభిమానులు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ జైషా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ప్రకటించారు.
ఒకేసారి 6.52 కోట్ల మంది వీక్షణ..
జైషా పోస్టులో.. 2026 టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్ను జియోహాట్స్టార్లో ఒకేసారి 6.52 కోట్ల మంది వీక్షించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ లైవ్ ఈవెంట్కైనా నమోదైన అత్యధిక డిజిటల్ పీక్ వీక్షణ.. అని పేర్కొన్నారు. ఈ రికార్డు భారత్లో క్రికెట్కు ఉన్న అపారమైన ప్రజాదరణను మరోసారి నిరూపించిందని జైషా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లు భారత అభిమానులను భారీ సంఖ్యలో ఆకర్షించే శక్తి కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే టోర్నమెంట్ నిర్వహణలో పాల్గొన్న ఐసీసీ బృందం, ప్రసార భాగస్వామి జియో హాట్ స్టార్ కు కూడా ఆయన అభినందనలు తెలిపారు.
Second semi-final of the @ICC #T20WorldCup 2026 has shattered the world record for digital viewership. The match between @BCCI and @EnglandCricket registered a peak digital concurrency of 65.2 million viewers @JioHotstar which is the highest for any live event across the world.…
— Jay Shah (@JayShah) March 6, 2026
భారత్లో క్రికెట్కు మరింత పెరిగిన ఆదరణ..
ఈ రికార్డు క్రీడలు, మీడియా, స్ట్రీమింగ్ రంగాల్లో కొత్త గ్లోబల్ ప్రమాణాలను సృష్టించిందని జైషా అన్నారు. డిజిటల్ యుగంలో క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షించే శక్తి మరింత పెరుగుతోందని అన్నారు. కాగా భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్ కేవలం క్రీడాపరంగా మాత్రమే కాకుండా డిజిటల్ వీక్షణలో కూడా చరిత్ర సృష్టించిన మ్యాచ్గా నిలిచింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగగా భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో జరగనుంది.












