
నటుడు సోనూసూద్ మరోమారు దాతృత్వం చాటుకున్నారు. కోవిడ్-19 సంక్షోభం సమయంలో, పంజాబ్ లో వరదలప్పుడు ఆయన ఎంతో మందికి సహాయం చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలోనూ గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా అక్కడ చిక్కుకుపోయిన వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో సోనుసూద్ మాట్లాడుతూ యుద్ధం కారణంగా దుబాయ్లో ఎంతో మంది యాత్రికులు చిక్కుకుపోయారని తెలిపారు. మీకు లేదా మీకు తెలిసిన ఎవరైనా దుబాయ్లో చిక్కుకుని, ఎక్కడికి వెళ్లాలో తెలియకపోతే అలాంటి వారికి సురక్షితమైన బసను ఎలాంటి ఖర్చు లేకుండానే ఉచితంగా అందిస్తున్నాం. మాకు దేశంతో పనిలేదు. ఎవరైనా సరే, ఎలాంటి నియమాలు లేవు. కేవలం మానవత్వం మాత్రమే. సహాయం కావల్సిన వారు సోషల్ మీడియాలో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి.. అని సోను తెలిపారు. అయితే సోను చూపిన దాతృత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయనను మళ్లీ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
ఏ దేశం వారికైనా సహాయం: సోనూసూద్
యుద్ధం కారణంగా దుబాయ్లో చిక్కుకున్న చాలా మందికి సహాయం కావాలని సోనుసూద్ అన్నారు. ఎవరికైనా సహాయం కావల్సి వస్తే తాము ఉచితంగా బసను ఏర్పాటు చేశామని, ఏ దేశానికి చెందిన వారైనా సరే తమకు పట్టింపు లేదని, సహాయం అందిస్తామని, తమ దేశానికి వెళ్లేంత వరకు నిశ్చింతగా, సురక్షితంగా ఉండవచ్చని, తమకు మానవత్వం ముఖ్యమని, ఏ దేశానికి చెందిన వారు అన్నది ముఖ్యం కాదని సోను తన వీడియోలో స్పష్టం చేశారు. అయితే సోనుసూద్ సహాయంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అప్పట్లో కోవిడ్ 19 సమయంలో సోను చేసిన సహాయం మరిచిపోలేనిదని, ఇప్పుడు ఆయన మళ్లీ ఇలా దయ చూపిస్తున్నారని, ఆయన ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పాకిస్థాన్కు చెందిన కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.
War has left many travelers stranded in Dubai.
If you or someone you know has nowhere to stay, we are offering safe accommodation free of cost.
No nationality. No conditions. Just humanity.
DM us on Instagram if you need help.
@dugastaproperties
Please share so this reaches… pic.twitter.com/TDDr9st79M— sonu sood (@SonuSood) March 5, 2026
సహాయం కోసం అభ్యర్థన..
డియర్ సోను, నా కుమారుడు, కోడలు కొత్తగా పెళ్లి చేసుకుని దుబాయ్కి హనీమూన్ నిమిత్తం వెళ్లారు. వారు ఇప్పుడు అక్కడ చిక్కుకున్నారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. దయచేసి మీరు వారికి సహాయం చేయండి. నా కోడలికి ఇండియాలో ఎగ్జామ్స్ ఉన్నాయి. వారిని ఎలాగైనా ఇండియాకు వచ్చేలా చేయండి.. అని ఒక యూజర్ కోరారు. అయితే ఒక యూజర్ మాత్రం.. యూఏఈ ప్రభుత్వం తమకు హోటల్లో గదులను, ఆహారాన్ని ఉచితంగానే అందిస్తుందని, అందువల్ల తమకు ఎలాంటి సమస్య లేదని, ఏదైనా సహాయం కావల్సి వస్తే కచ్చితంగా సోనుని సంప్రదిస్తామని తెలిపారు.
కొందరు ఇంకా అక్కడే..
కాగా గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేసి ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందించిన విషయం తెలిసిందే. దీంతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అందులో భాగంగానే చాలా మంది ఆ దేశాల్లో చిక్కుకుపోయారు. బాలీవుడ్ నటులు సోనల్ చౌహాన్, ఇషా గుప్తా వంటి వారు అక్కడే ఉండగా తాజాగా మళ్లీ పరిమిత సంఖ్యలో విమానాలను ప్రారంభించడంతో వారు సురక్షితంగా ఇండియాకు చేరుకున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా అక్కడ అనేక మంది చిక్కుకుని సహాయం కోసం వేచి చూస్తుండగా సోను వారి కోసం అలా స్పందించడం విశేషం.












