గణేష్ ఉత్సవాల్లో అపశృతి.. పెళ్లయిన రెండు నెలలకే ప్రాణాలను కోల్పోయిన నవ వరుడు..

September 13, 2021 2:08 PM

ఆ ఇంటిలో మొదలైన పెళ్లి కళ తగ్గిపోలేదు. ఇంటికి కట్టిన పచ్చతోరణం వాడి పోలేదు. వధువు చేతికి పారాణి ఆరకముందే ఆమె మెడలో పుస్తెలు తెగిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లైన జంట అత్తవారింట్లో వినాయక చవితి పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో వినాయకుడి నిమజ్జనం చేస్తుండగా వరుడుని మృత్యువు చెరువు రూపంలో కబలించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గణేష్ ఉత్సవాల్లో అపశృతి.. పెళ్లయిన రెండు నెలలకే ప్రాణాలను కోల్పోయిన నవ వరుడు..

సాలూరు పట్టణంలో దుర్గాన వీధికి చెందిన తిరుపతిరావు విశాఖపట్నంలోని పెప్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది జూన్ 24న తిరుపతి రావుకు రామభద్రపురం మండలంలోని జన్ని వలస గ్రామానికి చెందిన పత్తి గుళ్ల కుమారితో వివాహం జరిగింది. కొత్తగా పెళ్లైన వధూవరులు అత్తవారింట్లో వినాయక చవితి చేసుకోవాలని వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చి వధువు గ్రామంలో ఎంతో సంబరంగా వినాయక చవితిని జరుపుకున్నారు.

పండుగ రోజు సాయంత్రం వినాయకుడి నిమజ్జనం చేయాలని కుటుంబ సభ్యులందరూ కలిసి సమీపంలో ఉన్న చెరువు వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం వర్షాల కారణంగా చెరువు ఎంతో నిండుగా ఉంది. అయితే తిరుపతిరావుకి చెరువు లోతు తెలియకపోవడంతో కొద్దిగా ముందుకు వెళ్లి నిలబడగా ప్రమాదవశాత్తూ చెరువులో పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతడిని రక్షించినప్పటికీ అతనికి ఈత రాకపోవడంతో అధిక మొత్తంలో నీటిని తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అపస్మారక స్థితిలో ఉన్న తిరుపతిరావును సాలూరు పీహెచ్ సీకీ తరలించగా అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలియజేశారు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment