
తనను విమర్శించే వారిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని నటి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. తన సొంత బ్యానర్పై తెరకెక్కుతున్న రాకాస చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను తాజాగా నిర్వహించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను ఏప్రిల్ 3, 2026న రిలీజ్ చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన నిహారిక నిర్మాతగా తన కెరీర్పై పలు విషయాలను వివరించారు. నిర్మాతగా తాను కెరీర్ను ప్రారంభించగానే చాలా మంది ఎన్నో రకాలుగా విమర్శలు చేశారని అన్నారు. తాను ఏం చేసినా కొందరు విమర్శిస్తూనే ఉన్నారని, అందుకని అలాంటి వారిని పట్టించుకోవడం మానేశానని ఆమె స్పష్టం చేశారు.
నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటా: నిహారిక
కమిటీ కుర్రోళ్లు సినిమాతో 11 మంది కొత్త వాళ్లను పరిచయం చేశానని నిహారిక తెలిపారు. అప్పుడు చాలా మంది కామెంట్స్ చేశారని, ఇదంతా ఎందుకు చేస్తున్నావని అడిగారని, తెలిసిన వాళ్లతో సినిమాలు చేయవచ్చు కదా అని చెప్పారని, అయితే ఇప్పుడు రాకాస మూవీ చేస్తుంటే కమిటీ కుర్రోళ్లు లాంటి కథలతో సినిమాలు చేయవచ్చు కదా, ఇలాంటి గ్రాఫిక్స్ సినిమాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారని, అయితే తాను ఆ ప్రశ్నలను పట్టించుకోవట్లేదని చెప్పారు. అలాగే చిన్న చిన్న వాళ్లతో సినిమాలు చేయవచ్చు కదా అని మరికొందరు అంటున్నారని, తాను ఏం చేసినా మాటలు అనే వాళ్లు అంటూనే ఉన్నారని ఆమె తెలిపారు. అందుకనే తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటానని, నిర్మాతగా ప్రతి సినిమా నుంచి నేర్చుకుంటూనే ఉన్నానని పేర్కొన్నారు. కొణిదెల కుటుంబం తనకు ఎంత ముఖ్యమో తన బ్యానర్ పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యమని ఆమె అన్నారు.
కాగా నిహారిక నిర్మాతగా చేసిన కమిటీ కుర్రోళ్లు మూవీ 2024లో రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. దీనికి ఆమెతోపాటు పలువురు ఇతర నిర్మాతలు కూడా సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు వహించారు. యదు వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ను సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమైంది. ఈ మూవీ ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంది.












