
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి సమీరా రెడ్డి తెలిపింది. హిందూస్థాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బుద్దూ, వీక్ వంటి ప్రతికూల లేబుల్స్ పిల్లల ఆత్మవిశ్వాసంపై ఎంత ప్రభావం చూపుతాయో తనకు తెలుసని అన్నారు. తనకు కూడా చిన్నతనంలో తడబాటు (నత్తి) సమస్య ఉండేదని, తాను దాన్ని దగ్గరగా అనుభవించానని తెలిపింది. ఈ సమస్య వల్ల చిన్నతనంలో తనను చాలా మంది వేధించేవారని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు థెరపీ తీసుకున్నానని స్పష్టం చేసింది. ఇప్పటికీ తాను తడబడుతూ మాట్లాడితే కొందరు దాన్ని ఎగతాళి చేస్తుంటారని, అది తనను ఎంతో ప్రభావితం చేస్తుందని, తన మనసును గాయపరుస్తుందని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి తన వ్యక్తిగత అనుభవాలను నిర్మొహమాటంగా పంచుకుంది. ప్రసవానంతరం బరువు పెరుగుదల, పోస్ట్పార్టమ్ సమస్యలు, ఆందోళన, చిన్నతనంలో తడబాటు కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆత్మవిశ్వాసం పెరిగేందుకు తీసుకున్న థెరపీ వంటి అంశాలపై ఆమె మరింతగా స్పందించారు.
లేబుల్స్ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి..
లేబుల్స్ అనేవి సాధారణంగానే కనిపిస్తాయని, కానీ అవి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా దెబ్బ తీస్తాయని సమీరారెడ్డి అభిప్రాయ పడ్డారు. పిల్లలను స్లో లేదా వీక అని పదే పదే పిలిస్తే ఆ మాటలు వారిలో అనుమానాన్ని పెంచుతాయని, దీని వల్ల వారు చదువుల్లో, సామాజికంగా ప్రయత్నాలు చేసేందుకు వెనుకాడుతారని తెలిపింది. ఒక పిల్లవాడిని పదే పదే వీక్ లేదా బుద్ధూ అని పిలిస్తే వారు నిజంగానే అలా అనుకోవడం మొదలుపెడతారని, ఆ భావన క్రమంగా వారి స్వీయ అవగాహనను ప్రభావితం చేస్తుందని, చివరికి వారు ప్రయత్నించడం కూడా మానేస్తారని పేర్కొంది. ఇలా ఒక లేబుల్ స్వయంగా నిజమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె వివరించారు. కాగా సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నెటిజన్లు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమే అని అంగీకరిస్తున్నారు. పిల్లలను ఆ వయస్సులో అలా పిలవడం మానేయాలని సూచిస్తున్నారు.
మీ పిల్లలను ఇతరులతో పోల్చకండి: సమీరా రెడ్డి
ఇక సమీరా రెడ్డి నో ఎంట్రీ, రేస్, దే ధనా ధన్ వంటి పలు బాలీవుడ్ చిత్రాలలో నటించింది. పర్ఫెక్ట్ పేరెంట్ అనే భావనను విరమించుకోవాలని కూడా సమీరా సూచిస్తోంది. సోషల్ మీడియాలో మెస్సీ మామా అనే కంటెంట్ ద్వారా ఆమె గుర్తింపు పొందారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎట్టి పరిస్థితిలోనూ ఇతరులతో పోల్చవద్దని, అలాగే వారిపై లేబుల్స్ వేయడం మానుకోవాలని ఆమె సూచించారు. ఇక సమీరా రెడ్డి 2014 జనవరి 21న వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను సంప్రదాయ మహారాష్ట్ర పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు హాన్స్, కుమార్తె నైరా. హాన్స్ 2015లో, నైరా 2019లో జన్మించారు. ఆమె చివరిసారిగా 2012లో విడుదలైన టెజ్ చిత్రంలో కనిపించింది.
గమనిక/Disclaimer: మానసిక ఆరోగ్య సమస్యలు, ఆందోళన లేదా ఇతర ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఉన్నప్పుడు నిపుణులైన వైద్యులను లేదా కౌన్సిలర్లను సంప్రదించడం అవసరం. సెలబ్రిటీల అనుభవాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.












