
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు సెగలు వస్తున్నాయని, ఆటగాళ్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని శ్రీలంక టీ20ఐ జట్టు కెప్టెన్ దసున్ శనక కోరాడు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్తోపాటు తాజాగా న్యూజిలాండ్తో జరిగిన సూపర్ 8 మ్యాచ్లోనూ శ్రీలంక జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ప్రత్యర్థి జట్ల బౌలింగ్కు శ్రీలంక బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. శ్రీలంక ఓటమి పాలు కావడం వల్ల ఇంకో మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ సెమీస్కు అర్హత సాధించలేకపోయింది. దీంతో అక్కడి ఫ్యాన్స్ శ్రీలంక ప్లేయర్లను పెద్ద ఎత్తున విమర్శిస్తుండగా, వారి నుంచి ఆటగాళ్ల ప్రాణాలకు ముప్పు ఉందని శనక అన్నాడు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు రక్షణ కల్పించాలని అన్నాడు. టోర్నీలో జట్టు ఓటములపై, తాము వైఫల్యం చెందడంపై కూడా శనక స్పందించాడు.
శ్రీలంక ఫ్యాన్స్కు శనక క్షమాపణలు..
ఆట అన్నాక గెలుపోటములు సహజమని శనక అన్నాడు. అయితే గెలిచినా, ఓడినా విమర్శించే వారు విమర్శలు చేస్తూనే ఉంటారని, కొందరు ఫ్యాన్స్ నుంచి వచ్చే విమర్శలు, ట్రోల్స్ను కంట్రోల్ చేయలేమని అన్నాడు. అయితే ఫ్యాన్స్ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా, తమ పట్ల నెగెటివ్ భావం ఎంత ఉన్నా తాము పాజిటివ్గానే ఉంటామని, మ్యాచ్లో గెలిచేందుకు వంద శాతం ప్రయత్నిస్తామని తెలిపాడు. కానీ దురదృష్టవశాత్తూ తాము ఈ టోర్నీలో ఫ్యాన్స్ అంచనాల మేరకు రాణించలేకపోయామని, అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నామని తెలిపాడు. మ్యాచ్లో ప్లేయర్లు అందరూ అద్భుతంగా ఆడేందుకు యత్నించారు. కానీ మ్యాచ్లు మాకు అనుకూలంగా మారలేదు. వికెట్లను త్వరగా కోల్పోయాం. అదే విజయాలను దెబ్బ తీసింది. బ్యాటర్లు తమ శక్తిమేర రాణించేందుకు యత్నించారు. కానీ దురదృష్టవశాత్తూ సక్సెస్ కాలేదు. సొంత గడ్డపై వరల్డ్ కప్ లాంటి టోర్నీ జరుగుతున్నా రాణించలేకపోవడం నిజంగా వైఫల్యమే. అందుకు ఫ్యాన్స్ మమ్మల్ని మన్నించాలి.. అని శనక అన్నాడు.
ఆటగాళ్లకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి..
అయితే టోర్నీ ప్రారంభంలోనే కీలక ఆటగాళ్లు గాయాల పాలవడం, పిచ్లు తాము అనుకున్నట్లు లేకపోవడం, ఆటగాళ్ల ఫిట్ నెస్ వంటి అంశాలు జట్టుపై ప్రభావం చూపాయని, తాము ఓడేందుకు ఇవి కొన్ని కారణాలని, అయితే వీటిని కారణాలుగా చూపించి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం సమర్థనీయం కాదని అన్నాడు. తాను ఇంకా ఎంత కాలం కెప్టెన్గా ఉంటానో తెలియనని, కానీ టోర్నీలో మాత్రం తన శక్తి మేరకు కెప్టెన్గా జట్టును విజయాల బాటలో నడిపించేందుకు మాత్రం కఠినంగానే శ్రమించానని తెలిపాడు. అయితే వరుస ఓటముల కారణంగా ప్లేయర్లపై వ్యతిరేకత వస్తున్నందున ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఆటగాళ్లను రక్షిస్తూ భరోసా ఇవ్వాలని కోరాడు. కాగా శ్రీలంక జట్టు తాజాగా జరిగిన రెండు సూపర్ 8 మ్యాచ్లలోనూ బౌలింగ్ పరంగా ఫర్వాలేదనిపించినా బ్యాటింగ్ లో వరుసగా వైఫల్యం చెందింది. ఆ కారణంగానే సెమీస్కు అర్హత సాధించలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది.












