
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. రెండు పార్టీలకు ప్రజలు వేసే ఓట్లు వృథా అవుతాయని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. బీజేపీకి ఓటు వేస్తే ప్రధాని మోదీ రారని, బీఆర్ఎస్కు ఓటు వేస్తే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రారని, కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రమిస్తారని, కనుక కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీతోపాటు బీఆర్ఎస్పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది నాగుపాముల్లా పెనవేసుకున్న బంధం అని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులను గుజరాత్కు మళ్లింపు..
ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చి సెమీకండక్టర్ తయారీ యూనిట్ను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను గుజరాత్కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. గత 12 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎలాంటి ప్రత్యేక ప్రాజెక్టులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే, తిరిగి కేవలం 42 పైసల విలువైన ప్రాజెక్టులే వస్తున్నాయని అధికారులు తనకు చెప్పారని వెల్లడించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు కోట్ల రూపాయలు ఇస్తున్నామంటూ ప్రచారం చేస్తుందని, కానీ ఎక్కువ భాగం ఉత్తరాది రాష్ట్రాలకే వెళ్తోందని విమర్శించారు.
ఓవైసీ పేరునే బీజేపీ నేతలు ఎక్కువగా స్మరిస్తారు..
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించాయి. బీజేపీ నేతలు తమ దేవుడు రాముడని చెబుతారు. కానీ ప్రతి ఉదయం ఓవైసీకి నమస్కరిస్తారు. రోజంతా రాముడి పేరు కంటే అసదుద్దీన్ ఓవైసీ పేరును ఎక్కువగా స్మరిస్తారని అన్నారు. ఓవైసీనే బీజేపీకి జీవనాడిగా మారారని, ఎంఐఎం పేరుతోనే ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం ఒక రాజకీయ పార్టీగానే ఉందని, మతాన్ని రాజకీయం కోసం వాడుకోవడం బీజేపీ తత్వాన్ని చూపిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. కాషాయ పార్టీకి ఓటేయాలా వద్దా అన్నది తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.












