
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ దేశభక్తి నేపథ్య యాక్షన్ సినిమా, నిశ్శబ్దంగానే హిందీ సినీ చరిత్రలో అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో దాదాపు తన ప్రయాణాన్ని ముగించుకున్న ధురంధర్, అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్ట్రీమింగ్ తేదీ..
తాజా సమాచారం ప్రకారం, ధురంధర్ చిత్రం జనవరి 30, 2026 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ధురంధర్ ఓటీటీలో సాధించే విజయం, ఈ చిత్ర సీక్వెల్ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఇప్పటికే రెండో భాగం మార్చిలో విడుదల కానున్న నేపథ్యంలో, ఓటీటీ ద్వారా మరింత విస్తృత ప్రేక్షక వర్గానికి చేరుకోవడం నిర్మాతల లక్ష్యంగా కనిపిస్తోంది.
సీక్వెల్కు పునాది..
గతంలో పుష్ప తొలి భాగం అమెజాన్ ప్రైమ్లో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. పాటలు, అల్లు అర్జున్ స్టైల్, డైలాగ్స్ ఓటీటీలో విస్తృతంగా వైరల్ కావడంతో, మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన రెండో భాగం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అలాగే కేజీఎఫ్ కూడా ఓటీటీలో యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుని, సీక్వెల్కు బలమైన పునాది వేసింది. ఇప్పుడు అదే తరహాలో ధురంధర్ కూడా ఓటీటీలో భారీ ఆదరణ పొందుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. థియేటర్లలో ఇంకా పూర్తిగా చేరని ప్రేక్షకులను ఓటీటీ ద్వారా ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం సీక్వెల్కు కీలకంగా మారనుంది. నిశ్శబ్దంగా మొదలై సంచలన విజయంగా నిలిచిన ధురంధర్ ఇప్పుడు ఓటీటీ వేదికపై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ధురంధర్ ఓటీటీ వెర్షన్ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతోంది. థియేటర్లో 3 గంటల 34 నిమిషాలు ఉన్న సినిమాను, నెట్ఫ్లిక్స్లో 10 నిమిషాలు కట్ చేసి (3 గంటల 25 నిమిషాలు) స్ట్రీమింగ్ చేస్తున్నారని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా సీక్వెల్ మార్చి 19, 2026న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.








