
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి స్పందించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో ఆడుతున్న సిరాజ్, ఆ మెగా టోర్నీలో పాల్గొనాలని తనకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగానే సెలెక్టర్లు ఆ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నానని చెప్పాడు. న్యూజిలాండ్తో మూడో వన్డేకు ముందు మాట్లాడిన సిరాజ్, పెద్ద టోర్నీలో ఆడాలని ప్రతి ఆటగాడికీ ఉంటుంది. నాకూ ఆ అవకాశం రావాలని చాలా ఉంది. కానీ వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, అని పేర్కొన్నాడు.
2024 తర్వాత టీ20 జట్టుకు దూరం..
గమనార్హమైన విషయం ఏమిటంటే, సిరాజ్ 2024 తర్వాత భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని చివరి టీ20 మ్యాచ్ శ్రీలంకతో జరిగిన సిరీస్లోనే. ఆ మ్యాచ్లో అతడు మూడు ఓవర్లు వేసి వికెట్ లేకుండా 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇప్పటి వరకు సిరాజ్ భారత్ తరఫున 16 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. వాటిలో 14 వికెట్లు సాధించాడు. ఒకసారి నాలుగు వికెట్ల ఘనత కూడా అతని ఖాతాలో ఉంది. మొత్తం 452 పరుగులు ఇచ్చిన సిరాజ్, ముఖ్యంగా డెత్ ఓవర్లలో తన కట్టుదిట్టైన బౌలింగ్తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే రోహిత్ శర్మ నాయకత్వంలో జరిగిన టీ20 వరల్డ్కప్ 2024 జట్టులోనూ సిరాజ్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నప్పటికీ, 5.18 ఎకానమీ రేట్తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు.
టీ20 వరల్డ్కప్ 2026లో భారత్ షెడ్యూల్..
- సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని ఫిబ్రవరి 7న ప్రారంభించనుంది.
- తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7వ తేదీన అమెరికాతో ముంబైలో జరుగుతుంది.
- రెండో మ్యాచ్ను ఫిబ్రవరి 12న నమీబియాతో ఢిల్లీలో ఆడుతుంది.
- మూడో మ్యాచ్ను ఫిబ్రవరి 15వ తేదీన పాకిస్థాన్తో కొలంబోలో నిర్వహిస్తారు.
- నాలుగో మ్యాచ్ ఫిబ్రవరి 18వ తేదీన నెదర్లాండ్స్తో అహ్మదాబాద్లో జరుగుతుంది.
భారత టీ20 వరల్డ్కప్ 2026 జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు సాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.
కాగా టీ20 వరల్డ్కప్ నుంచి తప్పించబడినప్పటికీ, సిరాజ్ వన్డేలు, టెస్టుల్లో కీలక బౌలర్గా కొనసాగుతుండటంతో, భవిష్యత్తులో మళ్లీ టీ20 జట్టులోకి రానున్నాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
వార్త విశ్లేషణ..
మహమ్మద్ సిరాజ్ టీ20 ఫార్మాట్లో అద్భుతమైన బౌలర్ అనడంలో సందేహం లేదు. అయితే, ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ పేరుతో కీలక బౌలర్లను టెస్టులు, వన్డేలకు పరిమితం చేస్తోంది. సిరాజ్ వంటి సీనియర్ బౌలర్లను గాయాల బారిన పడకుండా చూసుకోవడం జట్టుకు అవసరమే అయినా, వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో అతని అనుభవం లోటు స్పష్టంగా కనిపిస్తుంది. సిరాజ్ ఈ నిర్ణయాన్ని సానుకూలంగా తీసుకోవడం అతని పరిణతిని చూపిస్తోంది.
– విశ్లేషణ: బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్












