CM KCR : పిచ్చి కూతలు కూస్తే మెడ‌లు విరుస్తాం.. నాలుక‌లు చీరేస్తాం.. బండి సంజ‌య్‌పై సీఎం కేసీఆర్ ఫైర్‌..!

November 7, 2021 8:17 PM

CM KCR : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్‌తోపాటు ఆ పార్టీపై, ఆ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కుల‌పై సీఎం కేసీఆర్ ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇన్ని రోజులు కేంద్రంతో స‌ఖ్య‌త‌తో ఉన్నామ‌ని, కానీ ఇక‌పై పోరాటం చేస్తామ‌న్నారు. కేంద్రంతో స‌ఖ్య‌త‌తో ఉంటే రాష్ట్రం బాగుప‌డుతుంద‌న్న ఉద్దేశంతో ఇన్ని రోజులు స‌ర్దుకుపోయామ‌ని, కానీ ఇక‌పై కేంద్రంపై పోరాటం చేస్తామ‌ని అన్నారు.

CM KCR sensational comments on bandi sanjay and bjp leaders

బీజేపీ నాయ‌కులు నాలుక ఉంది క‌దా అని పిచ్చి కూత‌లు కూస్తే మెడ‌లు విరుస్తాం అని కేసీఆర్ అన్నారు. ధాన్యాన్ని కొంటామ‌ని ఢిల్లీ నుంచి ఆదేశాలు తేవాల‌ని స‌వాల్ విసిరారు. ప్రాజెక్టుల్లో అవినీతి జ‌రుగుతుంద‌ని అంటున్నార‌ని.. ఎక్క‌డ అవినీతి జ‌రిగిందో చూపెట్టాల‌ని, ద‌మ్ముంటే కేసు పెట్టాల‌ని అన్నారు. కుక్క‌లు మొరిగిన‌ట్లు మొరిగితే స‌హించేది లేద‌న్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వంపై అడ్డ‌గోలు ప్ర‌చారం చేయ‌డం మానుకోవాల‌ని సీఎం కేసీఆర్ హిత‌వు ప‌లికారు. తాము ఉద్య‌మాలు చేసి వ‌చ్చిన వార‌మ‌ని, బీజేపీ నేత‌ల బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. ఇక‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట‌లు మాట్లాడితే స‌హించేది లేద‌ని, బీజేపీ నాయ‌కులు త‌మాషాలు చేస్తున్నార‌ని, ప‌చ్చి అబ‌ద్దాలు ఆడుతున్నార‌ని ఆరోపించారు. బీజేపీ నేత‌లు బీకేర్‌ఫుల్‌, జాగ్ర‌త్త.. అని అన్నారు.

యాసంగి పంట కొంటాం అని ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకురావాల‌ని బండి సంజ‌య్‌కు స‌వాల్ విసిరారు సీఎం కేసీఆర్‌. రైతుల‌కు క‌రెంటు, నీళ్లు, మందులు, విత్త‌నాలు ఉచితంగా ఇస్తామ‌ని, ధాన్యం కొంటామ‌ని చెప్ప‌గ‌ల‌రా.. అని ప్ర‌శ్నించారు. బీజేపీ నాయ‌కుల‌ను సీఎం కేసీఆర్ అల్లాట‌ప్పా గాళ్లుగా అభివ‌ర్ణించారు. అస‌లు బండి సంజ‌య్‌కు హిందీ, ఇంగ్లీష్ వ‌స్తాయా.. కేంద్రం విడుద‌ల చేసే లేఖ‌ల‌ను చ‌ద‌వ‌డం వ‌స్తుందా ? అని ప్ర‌శ్నించారు.

త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా నిందించార‌ని, అయినా స‌హించాన‌ని, కుక్క‌లు మొరుగుతున్నాయ‌ని అనుకున్నాన‌ని.. కానీ రైతుల విష‌యంలో బీజేపీ నేత‌లు చేస్తున్న అతిని స‌హించేది లేద‌ని సీఎం కేసీఆర్ హెచ్చ‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై బీజేపీ కుటిల య‌త్నాలు చేస్తుంద‌న్నారు. త‌మ‌ను ఇక‌పై తిడితే స‌హించేది లేద‌ని, త‌రిమి కొడ‌తామ‌ని అన్నారు.

సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడుతామ‌ని బండి సంజ‌య్ అంటున్నాడ‌ని.. త‌న‌ను ట‌చ్ చేసి చూడాల‌ని సీఎం కేసీఆర్ స‌వాల్ విసిరారు. పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ను త‌గ్గించాల‌ని, వాటిపై ప‌న్ను ఒక‌ప్పుడు ఎంత ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంద‌ని, తాము ప‌న్ను పెంచ‌లేదు క‌నుక త‌గ్గించాల్సిన అవ‌స‌రం లేద‌ని, కేంద్ర‌మే ఇంధ‌న ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని అన్నారు. లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ను రూ.70 కు తేవాల‌న్నారు.

ఇక‌పై రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌పై కూడా పోరాటం చేస్తామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను వెంట‌నే ఎత్తివేయాల‌ని ఆందోళ‌న‌లు చేస్తామ‌న్నారు. బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్ ఎంపీగా గెలిచాక రూ.10 విలువైన ప‌ని కూడా చేయ‌లేద‌న్నారు. అడ్డం పొడుగు మాట్లాడ‌డం కాదు, ఏ ప‌నులు చేశారో, కేంద్రం నుంచి బండి సంజ‌య్ ఎన్ని నిధుల‌ను తెచ్చారో చెప్పాల‌న్నారు. తాను బ‌తికి ఉన్నంత కాలం ద‌ళిత బంధును అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

త‌మ‌ది తెలంగాణ ప్ర‌జ‌లు, రైతుల మ‌ద్దతుతో ఏర్ప‌డిన ప్ర‌భుత్వ‌మ‌ని, దేశ వ్యాప్తంగా బీజేపీ ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని అన్నారు. ఎన్నిక‌లు అన్నాక గెలుపోట‌ములు స‌హ‌జం అని, ఒక్క ఓట‌మితో వ‌చ్చేది, పోయేది.. ఏదీ ఉండ‌ద‌న్నారు. త‌మ గురించి అవాకులు, చెవాకులు పేలితే నాలుక‌లు చీరేస్తం అని అన్నారు.

ఢిల్లీకి వేలాదిమందిగా వెళ్లి ధ‌ర్నా చేస్తామ‌ని, ధాన్యం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తామ‌ని అన్నారు. పంజాబ్ నుంచి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొంటుంద‌ని, తెలంగాణ నుంచి ఎందుకు కొన‌డం లేద‌ని, రాష్ట్రాల‌పై వివ‌క్ష ఎందుక‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. అన్ని రాష్ట్రాలు ఒక్క‌టే అని అన్నారు. ఇక‌నైనా తెలంగాణ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్రం కృషి చేయాల‌ని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now