ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల ఖాళీలపై కేంద్రం ప్రకటన.. ఒక్క ఐఏఎస్ లోనే 1300 పోస్టులు ఖాళీ!

దేశంలోని మూడు ఆల్ ఇండియా సర్వీసులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఓఎస్) ల‌లో 2,800కుపైగా ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

February 13, 2026 9:38 AM
Government of India report on vacancies in IAS, IPS and IFoS services
అఖిల భారత సర్వీసుల్లో 2,800 కంటే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. Photo Credit: Social Media.

దేశంలోని మూడు ఆల్ ఇండియా సర్వీసులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఓఎస్) ల‌లో 2,800కుపైగా ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో గురువారం (ఫిబ్ర‌వ‌రి 12, 2026) సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ వివరాలను పార్లమెంట్‌కు తెలియజేశారు. ఐఏఎస్ విభాగంలోనే 1,300 మంది అధికారుల కొరత ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. 2025 జనవరి 1న రూపొందించిన సివిల్ లిస్ట్ ప్రకారం, ఐఏఎస్‌లో 1,300 ఖాళీలు, ఐపీఎస్‌లో 505 ఖాళీలు, ఐఎఫ్‌ఓఎస్‌లో 1,029 ఖాళీలు ఉన్నాయని వివరించారు.

అత్యంత తీవ్రంగా ఐఎఫ్‌ఓఎస్ పరిస్థితి..

ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఐఏఎస్‌లో మొత్తం ఆమోదిత బలం 6,877 కాగా, అందులో 1,300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది సుమారు 18.9 శాతం ఖాళీ రేటుకు సమానం. ప్రస్తుతం 5,577 మంది ఐఏఎస్ అధికారులు విధుల్లో ఉన్నారు. ఐపీఎస్‌లో ఆమోదిత బలం 5,099 కాగా, అందులో 505 పోస్టులు భర్తీ కాలేదు. ఇది సుమారు 9.9 శాతం ఖాళీ రేటు. ప్రస్తుతం 4,594 మంది అధికారులు విధుల్లో ఉన్నారు. అయితే ఐఎఫ్‌ఓఎస్ పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. మొత్తం 3,193 ఆమోదిత పోస్టుల్లో 1,029 ఖాళీలు ఉన్నాయి. ఇది సుమారు 32.2 శాతం ఖాళీ రేటుకు సమానం. ప్రస్తుతం 2,164 మంది అధికారులు మాత్రమే విధుల్లో ఉన్నారు.

18.7 శాతం ఖాళీ రేటు..

మూడు ఆల్ ఇండియా సర్వీసులను కలిపి చూస్తే, మొత్తం ఆమోదిత బలం 15,169 కాగా, అందులో 2,834 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మొత్తం మీద దాదాపు 18.7 శాతం ఖాళీ రేటును సూచిస్తోంది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా 652 ఐఏఎస్ ఆమోదిత పోస్టులు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 571 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 459 ఆమోదిత పోస్టులకు గాను 391 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. మహారాష్ట్రలో 435 పోస్టులకు గాను 359 మంది మాత్రమే ఉన్నారు.

ఈ రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు..

ఐపీఎస్‌లో కూడా బీహార్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఆమోదిత బలం, విధుల్లో ఉన్న అధికారుల మధ్య గణనీయమైన తేడా కనిపిస్తోంది. ఐఎఫ్‌ఓఎస్‌లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. అనేక రాష్ట్రాల్లో ఆమోదిత పోస్టులు, భర్తీ చేసిన పోస్టుల మధ్య పెద్ద వ్యత్యాసాలు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఐదేళ్లలో (సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2020 నుండి 2024 వరకు) నేరుగా నియామకాల ద్వారా ఐఏఎస్‌లో 245 ఓబీసీ, 135 ఎస్సీ, 67 ఎస్టీ అభ్యర్థులు నియమితులయ్యారు. ఐపీఎస్‌లో 255 ఓబీసీ, 141 ఎస్సీ, 71 ఎస్టీ అభ్యర్థులు నియమితులయ్యారు. అదే కాలంలో ఐఎఫ్‌ఓఎస్‌లో 231 ఓబీసీ, 95 ఎస్సీ, 48 ఎస్టీ అభ్యర్థులు చేరారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment