
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి లుక్తోపాటు పలు సన్నివేశాలను ప్రేక్షకులకు చూపించారు. పట్టాభిషేకం నుంచి పంచవటి అరణ్యవాసం వరకు రణబీర్ కపూర్ రాముడి పాత్రలో ప్రశాంతత, గంభీరత, దివ్యత్వంతో ఆకట్టుకున్నారు. టీజర్ చివరలో రావణుడి పాత్రలో యష్ చిన్న చూపు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. టీజర్ విడుదలకు ముందు ఆలియా భట్ సోషల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా స్పందించారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తానని చెప్పిన ఆమె, తన భర్త రణబీర్ కపూర్ కృషికి మద్దతు ఇవ్వాలని ప్రేక్షకులను కోరారు. ఆ వీడియోలో ఆలియా మాట్లాడుతూ రామాయణ టీజర్ విడుదల కానుందని, తాను దాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తానని, అందరూ దాన్ని తప్పకుండా సపోర్ట్ చేయాలని, రణబీర్ చాలా అద్భుతంగా నటించాడని అన్నారు. ప్రేక్షకులు చూసే రోజు కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని, ఇది నిజంగా అద్భుతంగా ఉందని అన్నారు.
భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రం..
ఈ చిత్రం సుమారు రూ.4వేల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకారం ఈ ప్రాజెక్ట్ను ఆరు నుంచి ఏడు సంవత్సరాల క్రితమే ప్రారంభించగా ఈ స్థాయి సినిమా గురించి అప్పట్లో చాలామంది అనుమానించారు. రెండు భాగాలు కలిపి మొత్తం బడ్జెట్ దాదాపు 500 మిలియన్ డాలర్లు, అంటే రూ.4వేల కోట్లకు పైగా ఉంటుందని, ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరేలా చేస్తున్నామని ఆయన తెలిపారు.
సంగీతంలో అంతర్జాతీయ కలయిక..
ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్ రెహమాన్, ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మర్ కలిసి అందిస్తున్నారు. ఇద్దరూ కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. రెహ్మాన్ మాట్లాడుతూ ఇది తమకు ఇద్దరికీ పెద్ద సవాలని, ప్రపంచానికి ఎంతో ముఖ్యమైన ఇతిహాసానికి సంగీతం అందిస్తున్నామని, ప్రతి భారతీయుడికి తెలిసిన కథను కొత్తగా ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 అక్టోబర్లో దీపావళి సందర్భంగా విడుదల అవుతోంది. రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్తో పాటు సాయిపల్లవి సీతగా నటిస్తుండగా, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో, రవి దూబే లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నారు.












