
తనకు కమ్ఫర్ట్ జోన్లో ఉండడం అలవాటు లేదని, లైఫ్ ఎటు తీసుకెళ్తే అటే వెళ్తానని, ప్లాన్ చేసినవి జరగడం లేదని, వదులుకున్న తరువాతే అవకాశాలు వచ్చాయని నటి రాశీ ఖన్నా తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. హిందీలో ఇంకా తాను కొత్తదాన్నేనని, ఇప్పటి వరకు నాలుగు సినిమాలే చేశానని చెప్పుకొచ్చింది. దక్షిణాది అభిమానులు ఇచ్చిన ప్రేమ, ఆదరణ ఎంతో ఉన్నతమైందని గుర్తు చేసుకుంది. ఉత్తరాదిలో ఇప్పుడిప్పుడే తనను గుర్తిస్తున్నారని, ఇది తనకు మరో కొత్త అధ్యాయమని తెలిపింది. తెలుగులో కెరీర్ ఆరంభంలో వచ్చిన ప్రతి ఆఫర్ను స్వీకరించానని, అప్పుడు నేర్చుకోవడంపైనే దృష్టి పెట్టానని, పాత్ర చిన్నదా, పెద్దదా అనే విషయాన్ని పట్టించుకోలేదని స్పష్టం చేసింది.
ఫర్హాన్ తో 10 ఏళ్ల కిందట యాడ్లో..
ఒకప్పుడు తాను పాత్రల గురించి పెద్దగా పట్టించుకునేదాన్ని కాదని, కానీ ఇప్పుడు మాత్రం భావోద్వేగాలకు ఆస్కారం ఉన్న పాత్రల్లో చేయాలనుకుంటున్నానని తన మనసులో మాటను రాశీ ఖన్నా తెలియజేసింది. హిందీలో మహిళా ప్రధాన కథలు రావడం ఆనందంగా ఉందని, 120 బహదూర్ మూవీలో ఫర్హాన్ అక్తర్తో కలిసి నటించడం ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని తెలిపింది. 10 ఏళ్ల కిందట ఫర్హాన్తో ఒక యాడ్లో కలిసి చేశానని, అప్పట్లో పెద్దగా ఆయనతో మాట్లాడలేదని, కానీ మళ్లీ ఈ సినిమా సెట్లో ఆయనను కలవడం నిజంగా జీవితంలో ఒక సర్కిల్ ను పూర్తి చేసినట్లు అయిందని చెప్పింది. ఫర్హాన్ చాలా సరదాగా ఉంటారని చెప్పుకొచ్చింది.
తెలుగు నేర్చుకోవాలని ఉండేది..
తెలుగులో నటించాల్సి వచ్చినప్పుడు తాను మొదట భయపడ్డానని రాశీ ఖన్నా తెలిపింది. భయమే పెద్ద అడ్డంకి అని, తప్పులు మాట్లాడినా తెలుగులోనే మాట్లాడేదాన్నని వెల్లడించింది. తనకు అప్పట్లో తెలుగు నేర్చుకోవాలనే తపన బాగా ఉండేదని, తమిళం, మళయాళం కూడా అలాగే అలవాటు చేసుకున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఏ భాషనైనా సరే నేర్చుకుని పనిచేయగలననే నమ్మకం వచ్చిందని తెలియజేసింది. రవితేజ సానుకూల దృక్పథం తనపై ప్రభావం చూపిందని, జూనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రతిభే నిలబెడుతుందన్న పాఠం నేర్చుకున్నానని పేర్కొంది. ధనుష్తో పనిచేయడం వల్ల తన నటన మెరుగుపడిందని, మోహన్లాల్ హావభావాలను చక్కగా పలికిస్తారని, ఇక పవన్ కల్యాణ్ పక్కన ఉంటే ఆయన ఆరాకు డైలాగ్లు కూడా మర్చిపోతానని తెలిపింది.
రాశీ ఖన్నా ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉండగా ఆమె నటించిన తలాకోన్ మే ఏక్ మూవీ త్వరలో విడుదల కానుంది. ఇందులో ఆమె విక్రాంత్ మెస్సీతో కలిసి యాక్ట్ చేసింది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తనపై తనకు నమ్మకం ఉందని, పేరు, డబ్బు తన లక్ష్యం కావని రాశీ ఖన్నా ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా ఆమె మద్రాస్ కేఫ్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత తమిళం, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తోంది.












