
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ భారీ సక్సెస్ అయిందని, టోర్నీ ఇంకా ముగియక ముందే గత టీ20 వరల్డ్ కప్ల వ్యూయర్షిప్ రికార్డులను బ్రేక్ చేసిందని ఐసీసీ చైర్మన్ జైషా అన్నారు. ప్రస్తుత టోర్నీ ఇప్పటి వరకు 50 కోట్ల వ్యూయర్షిప్ను నమోదు చేసిందని, ఇది టీ20 వరల్డ్ కప్ టోర్నీల చరిత్రలోనే అత్యంత అధిక వ్యూయర్షిప్ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి సులభంగా చేరడంతోనే ఈ టోర్నీ ఇంత పెద్ద సక్సెస్ అయిందని, పెద్ద ఎత్తున ప్రజలు క్రికెట్ను ఆదరిస్తున్నారని చెప్పేందుకు ఇది ఉదాహరణ అని అన్నారు. డిజిటల్ యుగం కారణంగా చాలా మంది వీక్షకులు పెరిగారని, ఈ టోర్నీ ఇంత సక్సెస్ అయ్యేందుకు ఇది కూడా ఒక కారణమని తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 నిర్వహణపై పోస్టు పెట్టారు.
The journey of the @ICC #T20WorldCup 2026 began with the ambition to make it the most #global & #accessible Cricket event ever. I am humbled that viewership for the event in India has crossed 500 million, the highest ever for any T20 World Cup in history. It was also heartening…
— Jay Shah (@JayShah) March 4, 2026
50 కోట్ల వ్యూయర్షిప్..
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మందికి చేరాలనే లక్ష్యంతో మొదలైంది. కానీ మేము ఊహించినదానికన్నా భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఏకంగా 50 కోట్ల వ్యూయర్షిప్ను సాధించింది. భారత్, శ్రీలంక వేదికలుగా జరిగిన ఈ టోర్నీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇప్పటి వరకు అత్యధిక స్థాయిలో వ్యూయర్షిప్ను సాధించింది.. అని జైషా అన్నారు. భారత్లో జియో హాట్ స్టార్ మాధ్యమంలో ఒకానొక దశలో లైవ్లో 6.05 కోట్ల మంది మ్యాచ్ను చూశారని తెలిపారు. అయితే సెమి ఫైనల్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో భారత అభిమానులు ఇంకా అధిక స్థాయిలో మ్యాచ్లను వీక్షిస్తారు కనుక ఇప్పుడు ఏర్పడిన రికార్డులు కూడా బ్రేక్ అవుతాయని పేర్కొన్నారు. గత సీజన్ అమెరికా, వెస్టిండీస్లలో టీ20 ప్రపంచ కప్ జరగ్గా వచ్చిన వ్యూయర్షిప్ను ప్రస్తుత టోర్నీ ఇప్పటికే దాటేసిందని, ఇంకా మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో అధిక స్థాయిలో వ్యూయర్ షిప్ నమోదు అవడం ఖాయమని అన్నారు.
కాగా 2025లో పాకిస్థాన్, యూఏఈ వేదికలుగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ సైతం అధిక వ్యూయర్షిప్ను సాధించింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ ఆ టోర్నీ 250 బిలియన్ల నిమిషాల వాచ్-టైమ్ను నెలకొల్పగా, టీవీలో 122 మిలియన్ల వాచ్-టైమ్ను క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుత టీ20 ప్రపంచకప్ను భారత్, శ్రీలంక వేదికలుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభం కాగా మార్చి8న ముగియనుంది.












