
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను తెలుసుకుని ఇకపై అలా జరగకుండా చూసే అవకాశం లభించిందని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి అన్నారు. ఈ మ్యాచ్పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించిన రివ్యూ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన భారత్ ఈ మ్యాచ్లో చేసిన తప్పులను వివరించారు. రానున్న మ్యాచ్లలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగాలో కూడా తెలిపారు. జట్టులో ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉపయోగించాలి.. అన్న అంశాలపై టీమిండియాకు కీలక సూచనలు చేశారు.
టీమిండియాకు ఈ షాక్ అవసరమే: రవిశాస్త్రి
భారత జట్టు సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయి షాక్కు గురైందని, ఈ షాక్ అవసరమేనని, సెమీఫైనల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని రవిశాస్త్రి అన్నారు. సెమీఫైనల్కు అర్హత సాధించే జట్టుగా భావిస్తున్న దక్షిణాఫ్రికాపై ప్రారంభంలోనే ఓటమి చవిచూడటం మంచిదే. భారత్కు ఇది అవసరమైన హెచ్చరిక అవుతుంది. ఇకపై జట్టు కూర్పు, వ్యూహాలపై మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ అనుభవం నుంచి వారు పాఠాలు నేర్చుకుంటారు. సూపర్ 8లో మరో మ్యాచ్ కోల్పోతే తీవ్ర ఒత్తిడి తప్పదని అన్నారు. దక్షిణాఫ్రికా మ్యాచ్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇవ్వడంపై వచ్చిన చర్చకూ శాస్త్రి స్పందించారు. ఐదు కుడిచేతి బ్యాటర్లతో ఉన్న జింబాబ్వేపై అక్షర్ తిరిగి జట్టులోకి రావచ్చని మేనేజ్మెంట్ తెలిపినప్పటికీ, ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లను ఒకేసారి ఆడించవచ్చని శాస్త్రి సూచించారు.
అక్షర్ తప్పకుండా ఆడాలి..
అక్షర్ను తప్పకుండా తీసుకురావాలి. అనుభవం అవసరం. సాధ్యమైతే ఇద్దరినీ ఆడించాలి. ఒక బౌలర్కు చెడు రోజు వస్తే మరొకరు బ్యాకప్గా ఉండాలి. ఉదాహరణకు, వరుణ్ చక్రవర్తి తన స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. అందుకే అదనపు ఆప్షన్ అవసరం అని శాస్త్రి అన్నారు. అక్షర్ ఆడితే జట్టుకు ఎనిమిదో స్థానంలో బలమైన బ్యాటింగ్ లభిస్తుందని శాస్త్రి వివరించారు. హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో, శివమ్ దూబే ఆరో స్థానంలో, వాషింగ్టన్ సుందర్ ఏడో స్థానంలో, అక్షర్ ఎనిమిదో స్థానంలో ఆడవచ్చు. అవసరమైతే అక్షర్ ఐదో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడు.. అని పేర్కొన్నారు.
ఇద్దరు ఆల్రౌండర్లు ఆడితే హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్పెషలిస్ట్ ఫినిషర్ రింకు సింగ్ ను బెంచ్పై ఉంచాల్సిన పరిస్థితి రావచ్చని శాస్త్రి అభిప్రాయపడ్డారు. టీ20 క్రికెట్లో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నా మ్యాచ్ గెలవలేకపోతే, సమస్య వేరే చోటుంది అని అర్థం. ఇంత ఫైర్పవర్ ఉన్నప్పుడు బ్యాటింగ్ లోటు అనడం కష్టం. అసలు లోటు అదనపు బౌలింగ్ ఆప్షన్ లేకపోవడమే. అందుకే రింకూ సింగ్ తప్పుకోవాల్సి రావచ్చు. అతడు ఆడితే మాత్రం స్పెషలిస్ట్ బ్యాటర్ స్థానంలోనే రావాలని శాస్త్రి స్పష్టం చేశారు.
రెండు గెలిచినా కూడా..
కాగా అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలవగా సెమీ ఫైనల్లో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్లను మంచి రన్ రేట్తో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సౌతాఫ్రికా కూడా వెస్టిండీస్ను ఓడించాల్సి ఉంటుంది. అలా అయితేనే భారత్ జింబాబ్వే, వెస్టిండీస్లపై గెలిచి 4 పాయింట్లను సాధించి పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా సెమీస్కు చేరుకుంటుంది. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్ను ఫిబ్రవరి 26వ తేదీన చెన్నైలో జింబాబ్వేతో ఆడనుండగా, వెస్టిండీస్తో మార్చి 1న కోల్కతాలో మరో మ్యాచ్లో తలపడనుంది.












