
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి, ఆయన సతీమణి, నటి అనుష్క శర్మ బృందావన్లోని ఆశ్రమాన్ని సందర్శించి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. బృందావన్ ఆశ్రమంలో ఇతర భక్తులతో కలిసి కూర్చున్న కోహ్లి దంపతులకు ప్రేమానంద్ జీ మహారాజ్ భక్తి, ఆత్మసమర్పణ ప్రాముఖ్యతపై సందేశం ఇచ్చారు. కష్టకాలమే నిజమైన భక్తుల విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. చాలామంది భౌతిక కోరికలు నెరవేరాలని దేవుడికి శరణాగతి చేస్తారు. కానీ దేవుడి ప్రేమను కోరుకోవడమే అసలైన శరణాగతి.. అని ఆయన ఉపదేశించారు.
గంటకు పైగా ఆశ్రమంలోనే..
మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) ఉదయం ఆశ్రమానికి చేరుకున్న విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దాదాపు గంటకు పైగా అక్కడే గడిపారు. ఆధ్యాత్మిక చర్చలు, ధ్యానం మధ్య ప్రశాంత వాతావరణంలో వారు గడిపినట్లు ఆశ్రమ వర్గాలు తెలిపాయి. తమ కుమారుడు అకాయ్ రెండవ పుట్టినరోజు (ఫిబ్రవరి 15) జరిగిన రెండు రోజులకే ఈ జంట బృందావనం చేరుకోవడం విశేషం.
ఇది కోహ్లి దంపతుల తొలి ఆశ్రమ సందర్శన కాదు. గతేడాది మే 13, 2025న, విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్కు వీడ్కోలు ప్రకటించిన మరుసటి రోజే వారు ఇదే ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ సమయంలో కూడా ప్రేమానంద్ జీ మహారాజ్ ఇచ్చిన ఉపదేశాలను శ్రద్ధగా విన్నారు.
అప్పుడు ఆయన ఇచ్చిన సందేశంలో అంతర్ముఖ ఆలోచన, భక్తితో దేవుని నామస్మరణ చేయడం ద్వారా అంతర్గత శాంతి, ఆధ్యాత్మిక విముక్తి లభిస్తుందని వివరించినట్లు ఆశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కోహ్లి దంపతుల ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మరోసారి చర్చనీయాంశంగా మారింది.








