
దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ లో హీరోయిన్ మాళవిక మోహనన్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె పలు యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ముఖ్యంగా రౌడీలను ఎదుర్కొనే కొన్ని సందర్భాల్లో ఆమె గాల్లోకి ఎగిరి స్టంట్స్ చేసినట్లు సినిమాలో కనిపించింది. అయితే ఆ స్టంట్స్ అన్నీ డూప్ అని, ఆమె ఆ సీన్లలో పాల్గొంది కానీ గాల్లో ఎగిరే సీన్లను మాత్రం చేయలేదని, వాటికి బాడీ డూప్ లను వాడారని తాజాగా స్పష్టమైంది. అసలే ప్రభాస్ ముఖాన్ని స్వాప్ చేసి బాడీ డూప్ లు వాడడంతో ఫ్యాన్స్ చిర్రెత్రిపోయి ఉన్నారు. ఇక మాళవిక మోహనన్కు కూడా యాక్షన్ సన్నివేశాల్లో బాడీ డూప్లను వాడారని ప్రస్తుతం తెలియడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలో వారు సామాజిక మాధ్యమాల్లో చిత్ర యూనిట్తోపాటు దర్శకుడిని కూడా మరోమారు ట్రోల్ చేస్తున్నారు.
రాన్సన్ విన్సెంట్ షేరింగ్తో వైరల్..
సినిమాలో ఫైట్ సీన్లలో చేసిన రాన్సన్ విన్సెంట్ ఇన్స్టాగ్రామ్లో బిహైండ్ ది సీన్స్ తాలూకు ఫోటోలు, వీడియోను షేర్ చేశారు. అనంతరం ఆయన వీడియోను తొలగించినప్పటికీ, అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన పోస్టు చేసిన ఫోటోలలో గులాబీ రంగు క్రాప్ టాప్, షార్ట్ ధరించిన వ్యక్తితో రాన్సన్ నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తే మాళవిక బాడీ డబుల్ అని వెల్లడైంది. దీంతో కామెంట్లలో విమర్శలు వెల్లువెత్తడంతో రాన్సన్ ఆ వీడియోను తొలగించారు. అయితే ఒక ఎక్స్ యూజర్ ఆ పోస్టుకు సంబంధించిన స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ ఏందిరా ఇది? అంటూ వ్యాఖ్యానించాడు. ఆ చిత్రంలో రాన్సన్, మాళవికతో తీసిన సన్నివేశంతో పాటు బాడీ డబుల్తో ఉన్న ఫోటో కొలాజ్ కనిపిస్తోంది. మాళవిక బాడీ డబుల్ ఒక పురుషుడని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సినిమా పరిశ్రమలో ఇది సాధారణమేనని కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు మాళవిక స్వయంగా స్టంట్స్ చేసినట్టు భావించి అప్పుడు ఆమెను మెచ్చుకున్నామని, కానీ ఇప్పుడు అసలు విషయం తెలిసే సరికి తాము దెబ్బై పోయామని ఫీలవుతున్నారు.
Endhira idhi 😭🙏 pic.twitter.com/gihCkpPBCK
— ᵀᴴᴱABYSS (@sandydakait) February 10, 2026
మండిపడుతున్న ఫ్యాన్స్, నెటిజన్లు..
ఇక.. అసలు డూప్ వాడలేదన్నట్టుగా కవరింగ్ ఇచ్చింది.. అంటూ ఒక ఎక్స్ యూజర్ కామెంట్ పెట్టగా, మరొకరు మాళవిక ఫైట్ సీన్పై చేసిన పోస్టును రీషేర్ చేస్తూ మరి ఇది ప్రమోషన్ కోసమా?.. అని ప్రశ్నించారు. మరో వ్యక్తి కొన్ని స్క్రీన్షాట్లు షేర్ చేస్తూ అతను ఒక జంప్ కోసం మాత్రమే ఉన్నాడు అని చెప్పగా, ఇంకొకరు డూప్స్ వాడటం సినిమా నిర్మాణంలో భాగమే.. అని అన్నారు. అయితే మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం మాళవికకు కూడా బాడీ డబుల్ వాడారని, అందులోనూ ఒక పురుషున్ని అందుకోసం ఉపయోగించారని తెలిసి మండిపడుతున్నారు. ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్కు బాడీ డబుల్ను వాడి, ఆయన ఫేస్ను గ్రాఫిక్స్ ద్వారా స్వాప్ చేసి సినిమాను చెడగొట్టారని, ఆ విషయాలు సినిమాలో ప్రతి సీన్లోనూ స్పష్టంగా తెలుస్తున్నాయని ఫ్యాన్స్ ఇప్పటికీ సినిమా క్లిప్లు, స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దర్శకుడు మారుతి, చిత్ర యూనిట్ను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతున్నారు. పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇక మాళవికకు కూడా పలు కీలక యాక్షన్ సీన్లలో బాడీ డబుల్ ను వాడారని తేలడంతో అభిమానులు ఈ విషయంపై ఇంకా పెద్ద ఎత్తు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు.
As girls we rarely get to do action in films, but I love doing stunts & had so much fun doing this scene! 🥷💥♥️
Did you like this scene? ☺️ pic.twitter.com/VvAVCHBGVW
— Malavika Mohanan (@MalavikaM_) January 12, 2026
ఇంతకాలం నిజమే అని నమ్మారు..
అయితే అప్పట్లో.. అంటే.. ది రాజాసాబ్ సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలో.. సెట్స్ నుంచి మాళవిక మోహనన్ యాక్షన్ సీన్లకు చెందిన కొన్ని ఫొటోలు, వీడియోలు లీకయ్యాయి. ఆమె సినిమాలో కనిపించిన అవే గులాబీ రంగు దుస్తులతో కూడిన సీన్లు అప్పట్లో లీకయ్యాయి. ఇక సినిమా విడుదల అనంతరం ఇటీవలే ఆమె కూడా అవే సీన్లను మళ్లీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆమె నిజంగానే అద్భుతమైన యాక్షన్ సీన్లను చేసిందని ఇప్పటి వరకు అభిమానులు భావిస్తూ వచ్చారు. కానీ తాజాగా ఆమెకు కొన్ని సీన్లలో బాడీ డబుల్ను వాడారని స్పష్టం కావడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమాలో ఇలాంటి ప్రయోగాలు చేసే చాలా వరకు నాశనం చేశారని, అందుకనే సినిమా ఫెయిల్ అయిందని విమర్శిస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
అట్టర్ ఫ్లాప్గా ఓటీటీలోకి..
ఇక జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదలైన ది రాజా సాబ్ కు మొదట్లో మిశ్రమ స్పందన లభించింది. కానీ తరువాత బాక్సాఫీస్ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. రూ.400 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.205 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో మేకర్స్కు భారీ ఎత్తున నష్టాలు వచ్చాయి. ఇలాంటి చెత్త సినిమాను అసలు ప్రభాస్ ఎలా ఒప్పుకున్నారు, మారుతి లాంటి దర్శకుడికి ఎందుకు చాన్స్ ఇచ్చారు, మారుతి హార్రర్ కామెడీ సినిమాలను బాగానే తీస్తారు కదా, ఈ సినిమాను ఇలా ఎందుకు చేశారు.. అని ఫ్యాన్స్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాగా ఈ మూవీలో ప్రభాస్కు జోడీగా మాళవిక మోహనన్తోపాటు నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. అలాగే జరినా వహాబ్, సంజయ్ దత్, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రం జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.








