లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ స్థాయిని కొనసాగించగలడా అన్న సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

January 27, 2026 9:45 AM
Netizens criticizing director Lokesh Kanagaraj for weak storytelling in LCU
సోషల్ మీడియాలో లోకేష్ కనగరాజ్‌పై వస్తున్న విమర్శల సెగ. Photo Credit: Lokesh Kanagaraj.

కూలీ చిత్రం నిరాశాజనకమైన స్పందన ఎదుర్కొనడంతోపాటు సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురైన తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ కొంతకాలం మౌనం పాటించారు. సినిమా పరాజయానికి గల కారణాలపై ఆయన స్పష్టంగా మాట్లాడకపోవడం మరింత చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో లోకేష్ కనగరాజ్ తొలిసారి కూలీపై స్పందించారు. బాక్సాఫీస్ వసూళ్లు, విమర్శలు, సెన్సార్ సమస్యలు వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అలా చేయ‌డం వ‌ల్ల రూ.50 కోట్ల న‌ష్టం..

లోకేష్ మాట్లాడుతూ, కూలీ 35 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించబడిందని, నిర్మాణ‌ సంస్థ సన్ పిక్చర్స్ కూడా ఇది లాభదాయకమైన ప్రాజెక్ట్‌ అని ధ్రువీకరించిందని తెలిపారు. ట్రోలింగ్, నెగెటివ్ ప్రచారం ఉన్నప్పటికీ సినిమా మంచి వసూళ్లు సాధించిందని ఆయన అన్నారు. సెన్సార్ రివైజింగ్ కమిటీ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ పొందాలంటే 35 కట్లు సూచించారని, అయితే సినిమాలో శవదహనం (బాడీ బర్నింగ్) వంటి సన్నివేశాలు కీలకంగా ఉండటంతో అవి తొలగించకూడదని నిర్ణయించి ఎ సర్టిఫికెట్‌కే పరిమితమయ్యామని వెల్లడించారు. దీని వ‌ల్ల దాదాపు రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని చెప్పారు.

విమ‌ర్శ‌లు రావ‌డం ఆశ్చ‌ర్య‌కరం: లోకేష్‌

కూలీ పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా అని వ్యాఖ్యానించిన లోకేష్, రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాకు కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం తనకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఈ అనుభవం తర్వాత భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా, పారదర్శకంగా వ్యవహరిస్తానని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. చాలా మంది నెటిజన్లు లోకేష్ ఇప్పుడు కథ, కంటెంట్ కంటే డబ్బు, కలెక్షన్లపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ప్రేక్షకులు రూ.150 టికెట్ కొనుగోలు చేసి సినిమాను చూసే విలువను గౌరవించాలంటూ మాట్లాడిన లోకేష్, ఇప్పుడు అదే ప్రేక్షకులకు కలెక్షన్ల గణాంకాలతో సమాధానం చెబుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

లోకేష్‌పై విమ‌ర్శ‌లు..

ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ స్థాయిని కొనసాగించగలడా అన్న సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన బాధ్యతను స్వీకరించకుండా, కేవలం వసూళ్లనే విజయానికి ప్రమాణంగా చూపించడం పట్ల కూడా విమర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రెస్‌మీట్ తర్వాత కూలీపై చర్చ మరింత వేడెక్కింది. సోషల్ మీడియాలో అనుకూల-ప్రతికూల అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ కనగరాజ్ భవిష్యత్తు ప్రాజెక్టులు ఏ దిశలో సాగుతాయో, ఆయన మళ్లీ కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తారా లేదా కలెక్షన్లకే పరిమితమవుతారా అన్నది ఇప్పుడు సినీ వర్గాలు, అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్న అంశంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment