పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను తాను అనుకున్న విధంగానే తీర్చిదిద్దానని, అయినప్పటికీ చాలా మందికి నచ్చకపోవడంతోనే చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించామని దర్శకుడు బుచ్చిబాబు సానా తెలిపారు. పెద్ది సినిమాలో వివాదాస్పదంగా ఉన్న కొన్ని సీన్లను తీసేసినట్లు తెలియజేశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో దూసుకెళ్తోంది. అయితే చిత్రంలో ఉన్న కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో, సినీ ప్రపంచంలో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీంతో ఇటీవల దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పారు. జాన్వీ కపూర్ను తాను కావాలని అలా చూపించలేదని, మహిళలు అంటే తనకు అభిమానం, గౌరవం ఉన్నాయని వెల్లడించారు. ఇక పెద్ది సినిమాలో పలు సీన్ల తొలగింపు వెనుక ఉన్న అసలు కారణాలను ఆయన వెల్లడించారు.
స్క్రీన్ ప్లే వల్ల తప్పుగా అర్థం చేసుకున్నారు..
ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడారు. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఆమె పాత్ర అసలు సినిమాకు అవసరం లేదని చాలా మంది కామెంట్లు చేశారని, తన గత సినిమా ఉప్పెనతో పోలిస్తే పెద్ది కథను తాను పూర్తిగా భిన్నంగా తయారు చేశానని తెలిపారు. కొండ ప్రాంతంలో మారుమూల గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి పెద్ది అని, మొదట్లో అతనిలో మొరటుతనాన్ని చూపించి, తరువాత అతను మారినట్లు చూపించాలని భావించానని తెలిపారు. అతను పెరిగిన వాతావరణం వల్ల అలా ఉంటాడని, అతను మారేందుకు అమ్మాయి (జాన్వీ) ప్రేమ కూడా ఓ కారణం కావాలని ఆమె పాత్రను అలా తీర్చిదిద్దానని తెలిపారు. అయితే సినిమా స్క్రీన్ ప్లే వల్ల కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. దీంతో ఆ పాత్రనే చాలా మంది తప్పుగా అనుకున్నారని, విడుదల అనంతరం వచ్చిన విమర్శలను తాము పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు. కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి పూర్తిగా తీసేసినట్లు తెలిపారు.
బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో..
కాగా స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది మూవీలో చరణ్ టైటిల్ రోల్ను పోషించారు. తన నటనతో ఆయన ఈ సినిమాలో ప్రేక్షకులను మరోమారు మెప్పించారు. ఆయనకు జోడీగా జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రలో కనిపించారు. ఆమె పాత్రను గ్లామర్కే పరిమితం చేశారని, ఆమె ఇంట్రడక్షన్ సీన్లలోనూ ఆమెను చూపిన విధానం బాగాలేదని దర్శకున్ని విమర్శించారు. అయితే ఈ మూవీ ఇప్పటి వరకు రూ.315 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్లు తెలిపింది. సినిమాను రూ.300 కోట్ల బడ్జెట్తో నిర్మించగా, ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.












